అయిజ, వెలుగు: జోగులాంబ గద్వాల జిల్లా అయిజ పట్టణంలోని పాత బస్టాండ్ లో ఉన్న ఓ చాట్ భండార్ లో పానీ పూరి తిన్న 15 మంది మంగళవారం రాత్రి అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, విరేచనాలు కావడంతో స్థానిక ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందించారు. అస్వస్థతకు గురైన వారిలో విద్యార్థులు ఉండడంతో పేరెంట్స్ ఆందోళనకు గురయ్యారు. ప్రస్తుతం వారి పరిస్థితి నిలకడగా ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు. విషయం తెలుసుకున్న స్థానిక కౌన్సిలర్లు షెక్షావలి ఆచారి, మద్దిలేటి తదితరులు ఆసుపత్రికి చేరుకొని వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. పోలీసులు ఘటనపై ఆరా తీశారు.
