హైదరాబాద్: నగరంలోని సైఫాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అటవీ శాఖకు చెందిన ఓ ఉద్యోగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. కొడంగల్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో సెక్షన్ ఆఫీసర్ గా పనిచేస్తున్న మోహినుద్దీన్ పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నం చేసుకున్నాడు. బుధవారం ఉదయం అరణ్య భవన్ లో సూసైడ్ కు పాల్పడగా.. వెంటనే అక్కడ ఉన్న సిబ్బంది అతన్ని లక్డికాపుల్ లోని గ్లోబల్ హాస్పిటల్ కు తరలించారు.
ఫీల్డ్ లో పనుల నిమిత్తం ఖర్చు చేసిన బిల్లులు చెల్లించకుండా… కొడంగల్ ఫారెస్ట్ రేంజ్ అధికారి వెంకట్ గౌడ్ ఇబ్బందులకు గురిచేస్తున్నారని, ఆ మనస్తాపంతోనే మోహినుద్దీన్ ఆత్మహత్య యత్నానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. గత కొంత కాలంగా బిల్లుల కోసం ప్రధాన కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా.. అధికారులు పట్టించుకోవడం లేదని సమాచారం. అయితే ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని డాక్టర్స్ తెలిపారు.