
ఆసియాకప్ 2022లో టీమిండియా ఎంపిక సరిగా లేదని మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా అన్నాడు. టోర్నీలో జట్టు వైఫల్యానికి అదే కారణమని చెప్పాడు. లాస్ట్ ఇయర్ టీ20 వరల్డ్ కప్ తో పాటు..ఈ ఏడాది ఆసియాకప్ లోనూ ఘోరంగా ఓడిపోయిందని..టీమ్ సెలక్షన్ సరిగా ఉండే ఫలితం వేరే విధంగా ఉండేదన్నాడు. అంతే ఈ ఓటముల్లో సారథ్య లోపం లేదని అభిప్రాయపడ్డాడు.
కెప్టెన్సీలో లోపం లేదు..
2021లో టీమిండియా ఓడినప్పుడు చాలా మంది విరాట్ కోహ్లీ కెప్టెన్సీ గురించి మాట్లాడారు. సారథిని మార్చాలని అనేక డిమాండ్లు వినిపించాయి. ఇప్పుడు రోహిత్ శర్మ కెప్టెన్సీలో ఆసియాకప్లో టీమిండియా ఓడింది. దీంతో రోహిత్ నాయకత్వంపైనా విమర్శలు చేస్తున్నారు. ఇక్కడ కెప్టెన్సీ సమస్య గానీ..కెప్టెన్సీలో లోపం కానీ ఏమీ లేదు. జట్టు ఎంపికలో లోపాల వల్లే టీ20ల్లో భారత్ ఓడిపోతోంది..అని ఆకాశ్ చోప్రా చెప్పాడు.
టీమ్ సెలక్షన్ పై దృష్టిపెట్టాలి..
ప్రణాళిక లేకపోవడంతోనే ఆసియా కప్లో ఫలితాలు వ్యతిరేకంగా వచ్చాయి. ప్రతి మ్యాచ్లోనూ చాలా మార్పులు చేశాం. కానీ పాకిస్థాన్,శ్రీలంక వంటి జట్లు కేవలం ఒకే ఒక ఛేంజ్తో బరిలోకి దిగాయి. అందుకే జట్టు ఎంపికపై దృష్టిపెట్టాల్సిన అవసరం ఉంది'' అని ఆకాశ్ చోప్రా వివరించాడు.
ఆసియాకప్లో భారత్ ఘోరంగా ఓడిపోయి ఇంటిముఖం పట్టింది. ఫస్ట్ మ్యాచ్లో పాక్తో గెలిచింది. రెండో మ్యాచ్లో హాంకాంగ్పై విజయం సాధించింది. అయితే గ్రూప్ -4లో పాక్ , లంక చేతిలో ఓటమితో టోర్నీ నుంచి నిష్క్రమించింది. దీంతో భారత జట్టుపై విమర్శలు చెలరేగుతున్నాయి. అయితే అక్టోబర్ 16 నుంచి ఆస్ట్రేలియాలో టీ20 ప్రపంచకప్ ప్రారంభం కానుంది. ఈలోపు భారత్ ఆసీస్, దక్షిణాఫ్రికా జట్లతో స్వదేశంలో టీ20ల సిరీస్లను ఆడనుంది. ఈ నేపథ్యంలో టీ20 వరల్డ్ కప్ కోసమైనా సరైన జట్టును ఎంపిక చేయాలని అభిమానులు డిమాండ్ చేస్తున్నారు.