- పెయిన్ కిల్లర్స్తో అలర్జీ
- ఎన్నో సవాళ్లను అధిగమించా
- ఒలింపియన్ అంజూ జార్జ్
కొచ్చి: ఇండియా మాజీ అథ్లెట్, ఒలింపియన్ అంజూ బాబీ జార్జ్ తన జీవితానికి సంబంధించి ఆశ్చర్యకర విషయాలను బయటపెట్టింది. వరల్డ్ అథ్లెటిక్ చాంపియన్షిప్స్లో ఇండియాకు తొలి, ఏకైక మెడల్ అందించి రికార్డు సృష్టించడంతో పాటు మరెన్నో ఘనతలు అందుకున్న అంజూ ఒక్క కిడ్నీతోనే ఇదంతా సాధించానని తెలిపి అందరినీ ఆశ్చర్య పరిచింది. తనకు ఒకే కిడ్నీ ఉందని, పెయిన్ కిల్లర్స్తో తనకు అలర్జీ అని చెప్పింది. ఇన్ని ఇబ్బందులు, పరిమితుల మధ్య కూడా కెరీర్లో తాను ఎంతో సక్సెస్ సాధించి ఉన్నత శిఖరాలకు చేరుకున్నానని తెలిపింది. ‘మీరు నమ్ముతారో లేదో.. నాకు ఒకే కిడ్నీ ఉంది. దానితోనే ఈ ఆటలో వరల్డ్ టాప్ ప్లేస్కు చేరుకున్న అది కొద్ది మందిలో నేనూ ఒకదాన్ని. అలాగే, నాకు అలర్జీ ఉంది. కనీసం ఒక పెయిన్ కిల్లర్ కూడా తీసుకోలేని పరిస్థితి. ఇంకోవైపు ఓ డెడ్ లెగ్ (కాలు వాపు). ఇలా ఎన్నో లిమిటేషన్స్ ఉన్నా కూడా నేను ముందుకెళ్లా. దీన్ని కోచ్ చేసిన మ్యాజిక్ అనాలా? లేదా ఆయన టాలెంట్కు నిదర్శనం అని చెప్పాలా?’ అంటూ మాజీ లాంగ్ జంపర్ అంజూ ట్వీట్ చేసింది. కరోనా టైమ్లో ప్రాక్టీస్ కోల్పోయిన యంగ్ అథ్లెట్లలో స్ఫూర్తి నింపేందుకే ఈ విషయాన్ని వెల్లడిస్తున్నానని తెలిపింది. 2003 వరల్డ్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో బ్రాంజ్ మెడల్, 2005 ఐఏఏఫ్ వరల్డ్ అథ్లెటిక్స్ ఫైనల్స్లో గోల్డ్ నెగ్గిన జార్జ్ కెరీర్లో ఆమె కోచ్ రాబర్ట్ బాబీ జార్జ్ది కీలక పాత్ర. తనను వరల్డ్ క్లాస్ అథ్లెట్గా తీర్చిదిద్దిన రాబర్ట్నే అంజూ పెళ్లి చేసుకుంది. ఇంటర్నేషనల్ కెరీర్ స్టార్ట్ చేసేముందు 2001లో బెంగళూరులో ఓవరాల్ హెల్త్ చెకప్ చేయించుకున్నప్పుడు తాను ఒకే కిడ్నీతో జన్మించానన్న విషయం తెలిసి షాకయ్యానని అంజూ చెప్పింది. అయితే, భర్త బాబీ ఇచ్చిన మోటివేషన్తో ఆటలో కొనసాగి సక్సెస్ అయ్యానని చెప్పుకొచ్చింది. అవసరం అయితే తన కిడ్నీ ఇస్తానని బాబీ చెప్పాడని తెలిపింది. ‘2003 వరల్డ్ అథ్లెటిక్స్ కోసం పారిస్ వెళ్లినప్పుడు అలసటగా అనిపిస్తే అక్కడి డాక్టర్లను కలిశా. నన్ను ఆరు నెలలు రెస్ట్ తీసుకోవాలని చెప్పారు. ఆ టైమ్లో స్పోర్ట్స్ గురించి అసలు ఆలోచించడమే మానేయాలని సూచించారు. అప్పటికి టోర్నీకి 20 రోజుల గడువు మాత్రమే ఉంది. ఈ అవాంతరాలన్నింటికీ దాటుకొని నేను మెడల్తో తిరిగొచ్చా’ అని అంజూ పేర్కొంది.
కాగా, అంజూ ట్వీట్పై సెంట్రల్ స్పోర్ట్స్ మినిస్టర్ కిరణ్ రిజిజు స్పందించారు. తన హార్డ్వర్క్, ధైర్య సాహసాలు, దృఢ సంకల్పంతోనే అంజూ దేశానికి పేరు తెచ్చిందని ప్రశంసించారు. కెరీర్ అసాంతం అద్భుతంగా రాణించి ట్రాక్ అండ్ ఫీల్డ్లో ఇండియాలోనే గొప్ప అథ్లెట్గా పేరు తెచ్చున్న జార్జ్.. 2004 ఒలింపిక్స్ లాంగ్జంప్లో తన పర్సనల్ బెస్ట్ (6.83 మీటర్లు)తో ఆరో ప్లేస్లో నిలిచింది. అయితే, అమెరికా జంపర్ మేరియన్ జోన్స్ డోపీగా తేలి డిస్క్వాలిఫై కావడంతో 2007లో అంజూ జార్జ్ పొజిషిన్ను ఐదో ప్లేస్కు మార్చారు.