గన్ను విడిచి పెన్ను పట్టి.. 42 ఏండ్ల తర్వాత ఇంటర్ ఎగ్జామ్ రాసిన దేవ్జీ

గన్ను విడిచి పెన్ను పట్టి.. 42 ఏండ్ల తర్వాత ఇంటర్ ఎగ్జామ్ రాసిన దేవ్జీ
  • అప్పట్లో మిగిలిపోయిన తెలుగు పరీక్షకు అటెండ్

కోరుట్ల, వెలుగు: ఇటీవలే గన్ను వీడిన మాజీ మావోయిస్టు తిప్పిరి తిరుపతి అలియాస్  దేవ్​జీ మళ్లీ పెన్ను పట్టారు. 42 ఏండ్ల క్రితం ఇంటర్​లో ఫెయిల్​ అయిన తెలుగు పరీక్షను బుధవారం కోరుట్లలో రాశారు. జగిత్యాల జిల్లా కోరుట్లకు చెందిన దేవ్​జీ ప్రాథమిక విద్యను కోరుట్లలోనే పూర్తి చేశారు. ఇంటర్​ కోసం 1982-83లో స్థానిక ప్రభుత్వ జూనియర్ కాలేజీలో చేరారు. అప్పట్లో విప్లవ భావజాలానికి ఆకర్షితుడై స్టూడెంట్ రాడికల్ యూనియన్ (ఆర్ ఎస్ యూ)లో ఆర్గనైజర్ గా చేరాడు. 

ఆ క్రమంలోనే దేవ్​జీపై పలు కేసులు నమోదయ్యాయి. దీంతో చదువుకు ఆటంకం ఏర్పడింది. ఇంటర్​ రెండో సంవత్సరం పరీక్షలు రాసిన తర్వాత దేవ్​జీ అడవి బాట పట్టారు. సెంకడ్​ ఇయర్​ఎగ్జామ్స్​లో అన్ని సబ్జెక్టుల్లో పాస్​ అయినప్పటికీ తెలుగు పరీక్షలో ఫెయిల్ అయ్యారు. మళ్లీ ఆ పరీక్ష రాసే అవకాశం దేవ్​జీకి చిక్కలేదు.

42 ఏండ్ల తర్వాత ఇటీవలే జన జీవన శ్రవంతిలోకి వచ్చిన దేవ్​జీ ఇంటర్ విద్యను పూర్తి చేయాలని నిర్ణయించుకున్నారు. ఇంటర్ బోర్డు నుంచి ప్రత్యేక అనుమతి తీసుకుని ఇంటర్​లో మిగిలిపోయిన తెలుగు పరీక్షకు సప్లిమెంటరీలో రాసేందుకు ప్రిపేర్​ అయ్యారు. బుధవారం మధ్యాహ్నం జగిత్యాల జిల్లా కోరుట్లలోని ఓ ప్రైవేట్ జూనియర్ కాలేజ్ లోని ఎగ్జామ్​ సెంటర్​కు ప్యాడ్, హాల్ టికెట్​తో వచ్చారు.

ఇంటర్​ విద్యార్థులతో కలిసి తెలుగు పరీక్ష రాశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉద్యమంలోకి వెళ్లినప్పుడు చదువు ఎక్కడ ఆగిందో అక్కడి నుంచి మళ్లీ మొదలు పెట్టాలని నిర్ణయించుకున్నట్టు చెప్పారు. ఇంటర్​ పూర్తి చేసి న్యాయ విద్యను అభ్యసించాలనుకుంటున్నట్టు చెప్పారు. పేదలకు న్యాయ సహాయం అందించాలన్నదే తన లక్ష్యమని పేర్కొన్నారు.