
- కోడెలకు గడ్డి లేదు.. ఎర్రగడ్డ మానసిక రోగులకు అన్నం పెట్టరు
- రేవంత్ రెడ్డి పాలనంతా ఆగమాగం
- ఇది మాటల ప్రభుత్వమే తప్ప చేతల్లేవ్
మెదక్: సీఎం రేవంత్ రెడ్డి నిర్లక్ష్య వైఖరి వల్ల రాష్ట్రానికి అరిష్టం జరుగుతుందని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. వేములవాడ రాజన్న ఆలయంలో కోడెలకు అన్నం పెట్టలేని ప్రభుత్వం, ఎర్రగడ్డ మానసిక వైద్యాలయంలో రోగులకు అన్నం పెట్టలేని దుస్థితి నెలకొందని ఆరోపించారు. బీఆర్ఎస్ నాయకులను అక్రమ కేసుల్లో ఇరికించే ప్రయత్నమే తప్ప ప్రజలకు పనికొచ్చే ఒక్క పని కూడా చేయడం లేదని ఫైర్అయ్యారు. మెదక్ జిల్లా నర్సాపూర్ లో హరీశ్ మీడియాతో మాట్లాడారు.
‘రేవంత్ రెడ్డి అబద్ధాల్లో రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపాడు. దేవుళ్ల మీద ఓట్లు వేసి మరీ.. వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని బాండ్ పేపర్ రాసిచ్చి ప్రజల్ని మోసం చేశారు. ఎములాడ రాజన్న గుడిలో రోజూ కోడెలు చనిపోతుంటే ప్రభుత్వానికి చీమకుట్టినట్టైనా లేదు. మానసిక పరిస్థితి బాగాలేక దవాఖానాలో చేరిన వారికి సరైన భోజనం పెట్టలేని పరిస్థితిలో ఉన్నరు. వడ్ల కుప్పల మీద రైతుల ఊపిరి ఆగిపోతుంటే, ఈ ప్రభుత్వం అందాల పోటీలపై శ్రద్ధ పెట్టింది. 40 వేల కోట్ల రుణమాఫీ ఇప్పటివరకు చేయలేదు.
పంటలు కోతకొచ్చి అమ్ముకున్నా ఇప్పటివరకు రైతులకు యాసంగి రైతుబంధు రాలేదు. కొత్త రేషన్ కార్డులు ఇస్తానని చెప్పి ఒక్క రేషన్ కార్డు ఇయ్యలేదు. ఇందిరమ్మ ఇండ్ల ఊసే లేదు. కాంగ్రెస్పాలనంతా ఆగమాగం. ఇది మాటల ప్రభుత్వమే తప్ప చేతలు లేవు. కాంగ్రెస్ నాయకులు సొంత ఆదాయం మీద దృష్టి పెడుతున్నారు తప్ప ప్రజల గురించి ఆలోచించడం లేదు. విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ డబ్బులను వెంటనే విడుదల చేయాలి. రైతులకు బాకీ పడ్డ మూడు పంటల 18 వేల రూపాయలు తక్షణమే ఇవ్వాలి ’అని డిమాండ్చేశారు.