జోర్డాన్లో చిక్కుకున్నవారిని ఆదుకోవాలి..12 మంది కార్మికులు ఇబ్బందుపడ్తున్నరు: హరీశ్ రావు

జోర్డాన్లో చిక్కుకున్నవారిని ఆదుకోవాలి..12 మంది కార్మికులు ఇబ్బందుపడ్తున్నరు: హరీశ్ రావు

హైదరాబాద్, వెలుగు: ఉపాధి కోసం జోర్డాన్ వెళ్లి అక్కడ చిక్కుకుపోయిన 12 మంది కార్మికుల ఆవేదనను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు విమర్శించారు. గల్ఫ్ బాధితులకు భరోసా ఇవ్వాలని ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోకుండా చోద్యం చూడడం సిగ్గుచేటని శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. 

నిర్మల్, కామారెడ్డి, నిజామాబాద్, జగిత్యాల, సిద్దిపేటకు చెందిన గల్ఫ్ కార్మికులు దేశం కాని దేశంలో బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అక్కడే ఉండి బతికేందుకు చేతిలో డబ్బులు లేక, కంపెనీ అనుమతి ఇవ్వకపోవడంతో తిరిగి స్వదేశానికి రాలేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. వారికి అండగా నిలవాల్సిన బాధ్యత ప్రభుత్వాలకు లేదా? అని ప్రశ్నించారు. 

‘‘బీఆర్ఎస్ పాలనలో వలసలు వాపస్​ అయితే.. ఇప్పుడు మళ్లీ మొదలయ్యాయి. కాంగ్రెస్ పాలనలో ఉపాధి, ఉద్యోగాలు కరువై ఎడారి ప్రాంతాలకు వలస పట్టే దుస్థితి వచ్చింది. అభయ హస్తం మేనిఫెస్టోలో గల్ఫ్ కార్మికులు, ఎన్నారైల సంక్షేమం అంటూ అనేక హామీలు ఇచ్చింది తప్ప, ఇప్పటి వరకు ఒక్కటీ అమలు చేయలేదు. ఏడాదిన్నర పాలన తర్వాత గల్ఫ్ కార్మికుల సంక్షేమం, సమగ్ర ఎన్నారై పాలసీపై అధ్యయనం చేసేందుకు ఏర్పాటు చేసిన అడ్వైజరీ కమిటీ ఏం చేస్తున్నట్లు? గల్ఫ్ కార్మికులు సంక్షోభంలో ఉంటే ఆ కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్, గౌరవ సభ్యులు, సభ్యులు ఏం చేస్తున్నారు? మేనిఫెస్టోలో చెప్పిన ఎన్నారైల సంక్షేమ బోర్డు, గల్ఫ్ సంక్షేమ బోర్డులకు అతీ గతి లేదు. 

విదేశాల్లో ఉన్న వలస కార్మికుల సంక్షేమం కోసం ఏర్పాటు చేస్తానన్న టోల్ ఫ్రీ హెల్ప్ లైన్ ఇప్పటికీ దిక్కులేదు. గల్ఫ్ దేశాల్లో చిక్కుకున్న కార్మికులను వెంటనే తిరిగి తీసుకొచ్చేందుకు సీఎం రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ చొరవ చూపించాలి’’ అని హరీశ్​ రావు డిమాండ్ చేశారు.