నాకు టికెట్ ​ఇయ్యకుంటే..  పార్టీ మారుతా: మాజీ ఎమ్మెల్యే అరవింద్​రెడ్డి

నాకు టికెట్ ​ఇయ్యకుంటే..  పార్టీ మారుతా: మాజీ ఎమ్మెల్యే అరవింద్​రెడ్డి
  • టికెట్ ​ఇయ్యకుంటే  పార్టీ మారుతా
  • నాకు గానీ, బీసీ అభ్యర్థికి గానీ ఇయ్యాలె 
  • మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే అరవింద్​రెడ్డి

మంచిర్యాల, వెలుగు: రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో మంచిర్యాల బీఆర్ఎస్ టికెట్​తనకు ఇవ్వాలని మాజీ ఎమ్మెల్యే గడ్డం అరవింద్​రెడ్డి హైకమాండ్​ను డిమాండ్​చేశారు. ఒకవేళ తనకు ఇవ్వకపోతే నియోజకవర్గంలో మెజారిటీ సంఖ్యలో ఉన్న బీసీలకు​కేటాయించాలన్నారు. తనకు గానీ, బీసీ అభ్యర్థికి గానీ టికెట్​ఇయ్యకుంటే పార్టీ మారడానికి సిద్ధమని వార్నింగ్​ఇచ్చారు. సోమవారం ఆయన అనుచరులతో కలిసి మంచిర్యాలలోని తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్​లీడర్, మాజీ ఎమ్మెల్సీ కొక్కిరాల ప్రేమ్​సాగర్​రావును ఓడించడమే తన లక్ష్యమని అరవింద్​రెడ్డి తెలిపారు. ప్రేమ్​సాగర్​ను ఓడించడం బీఆర్ఎస్​సిట్టింగ్​ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్​రావు, ఆయన కొడుకు విజిత్​రావుకు సాధ్యం కాదన్నారు. దివాకర్​రావుపై ప్రజల్లో వ్యతిరేకత ఉందని, రానున్న ఎన్నికల్లో ఆయనకు ఓటమి తప్పదని హెచ్చరించారు. మంచిర్యాలలో మళ్లీ బీఆర్ఎస్​గెలవాలంటే టికెట్​తనకు గానీ లేదా బీసీలకు టికెట్ ఇవ్వాలన్నారు.

పీఎస్సార్ గెలిస్తే  ప్రజలు ఆగమైతరు

కాంగ్రెస్​నుంచి ప్రేమ్​సాగర్​రావు గెలిస్తే మంచిర్యాల ప్రజలు ఆగమవుతారని అరవింద్​రెడ్డి అన్నారు. భూకబ్జాలు, గూండాయిజం పెరుగుతుంది తప్ప అభివృద్ధి జరగదన్నారు. ఆయన సొంత పార్టీ లీడర్ల దగ్గర అందినకాడికి అప్పులు తీసుకొని వారిని ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు. అప్పులు తీర్చడానికి మళ్లీ ప్రజలను దోచుకుంటాడని ఆరోపించారు. ఈసారి ఆయనను ఓడించి మంచిర్యాల నుంచి తరిమేయడమే తన ధ్యేయమన్నారు. ‘దివాకర్​రావు, విజిత్​రావులకు చేతులెత్తి మొక్కుతున్నా.. ఈ ఒక్కసారికి మీరు తప్పుకొని నాకు గానీ, బీసీలకు గానీ అవకాశం ఇవ్వండి’ అని అరవింద్ రెడ్డి కోరారు. మొన్న మంత్రి కేటీఆర్​ను కలిసినప్పుడు కూడా ఇదే విషయం చెప్పానన్నారు. బీసీలకు ఏ పార్టీ టికెట్​ ఇస్తే ఆ పార్టీలోకి వెళ్తామన్నారు. ఎవరూ టికెట్​ఇయ్యకపోతే ఇండిపెండెంట్​గానే పోటీ చేస్తానని ఆయన స్పష్టం చేశారు.