
అయిజ, వెలుగు: అలంపూర్ వ్యవసాయ మార్కెట్ పరిధిలోని అయిజ మార్కెట్ యార్డును ప్రత్యేక మార్కెట్యార్డుగా గుర్తించాలని మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ కోరారు. ఈ మేరకు శనివారం హైదరాబాద్లో రైతు సంక్షేమ కమిషన్చైర్మన్ కోదండ రెడ్డిని కలిశారు. అలంపూర్, అయిజ మార్కెట్ యార్డుల మధ్య 50 కిలోమీటర్ల దూరం ఉందన్నారు. దీంతో అయిజ, వడ్డేపల్లి, రాజోలి తదితర మండలాలకు చెందిన రైతులు ధాన్యం విక్రయానికి అలంపూర్ మార్కెట్ కు వెళ్లేందుకు ఇబ్బంది పడుతున్నారని పేర్కొన్నారు.
అలంపూర్ మార్కెట్ సబ్ యార్డుగా కొనసాగుతున్న అయిజ మార్కెట్ ను ప్రత్యేక మార్కెట్ యార్డుగా గుర్తిస్తే వారికి మేలు జరుగుతుందని తెలిపారు. అలాగే నడిగడ్డ లో విత్తన పత్తి సాగులో రైతులకు ఇబ్బంది కలగకుండా చూడాలని, నకిలీ విత్తనాలను కట్టడి చేయాలని విన్నవించారు. గద్వాల గ్రంథాలయ సంస్థ చైర్మన్ నీలి శ్రీనివాస్, మాజీ జడ్పీటీసీ మద్దిలేటి, యువరాజు తదితరులు పాల్గొన్నారు.