కిడ్నాప్ కేసులో మాజీ MLA వల్లభనేని వంశీకి బెయిల్

కిడ్నాప్ కేసులో మాజీ MLA వల్లభనేని వంశీకి బెయిల్

అమరావతి: సత్యవర్థన్ కిడ్నాప్ కేసులో అరెస్ట్ అయ్యి  జైల్లో ఉన్న వైసీపీ నేత, మాజీ గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి భారీ ఊరట దక్కింది. ఈ కేసులో వంశీకి బెయిల్ మంజూరు అయ్యింది. విజయవాడ ఎస్సీ, ఎస్టీ కోర్టు మంగళవారం (మే 13) ఆయనకు షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది. వంశీతో పాటు ఇదే కేసులో అరెస్ట్ అయిన మరో నలుగురికి కూడా న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. 

కాగా, 2024 ఫిబ్రవరి 20న గన్నవరం టీడీపీ కార్యాలయంపై అప్పడు గన్నవరం ఎమ్మెల్యేగా ఉన్న వల్లభనేని వంశీ అనుచరులు, వైసీపీ నాయకులు దాడి చేసి నిప్పుబెట్టారు. గన్నవరం టీడీపీ కార్యాలయం ఆపరేటర్ ముదునూరి సత్యవర్ధన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఐపీసీ సెక్షన్ 143, 147, 148, 435, 506 రెడ్విత్ 149, 3(1) (ఎస్సీ, ఎస్టీ చట్టం) కింద కేసు నమోదు చేశారు. కార్యాలయ ఫర్నిచర్ను ధ్వంసం చేసి అక్కడే ఉన్న కొందరు టీడీపీ నేతలను గాయపరిచి వాహనాలను తగులబెట్టినట్టుగా వంశీ అనుచరులపై కేసు నమోదైంది. 

వంశీ అనుచరులు,  వైసీపీ కార్యకర్తలు.. మొత్తం మీద 71 మంది ఈ దాడికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. సీసీ కెమెరాలు, వీడియోల ద్వారా నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనలో కుట్ర కోణం ఉందని, గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి వెనుక వంశీ పాత్ర ఉందని కేసులో ఆయనను నిందితుడిగా చేర్చారు.  ఈ క్రమంలోనే 2025 ఫిబ్రవరి 13న  హైదరాబాద్లో వంశీని ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు.

 హైదరాబాద్లో అదుపులోకి తీసుకుని విజయవాడకు తరలించారు. తర్వాత పలుసార్లు ఆయన రిమాండ్ పొడిగించింది కోర్టు. ఈ క్రమంలో తనకు బెయిల్ ఇవ్వాలంటూ వంశీ దాఖలు చేసిన పిటిషన్ పై విజయవాడ ఎస్సీ, ఎస్సీ కోర్టు విచారణ జరిపి.. అతడికి బెయిల్ మంజూరు చేసింది. దీంతో దాదాపు మూడు నెలలుగా జైల్లో ఉన్న వంశీ బయటకు రానున్నారు.