- పైసలతో కేసీఆర్ కుట్రలు
- మున్సిపోల్స్లో బీజేపీ జెండా ఎగరాలి
- చెన్నూరు, క్యాతన్పల్లి మున్సిపాలిటీల్లో సమావేశాలు
రామకృష్ణాపూర్/మంచిర్యాల, వెలుగు: మున్సిపల్ ఎన్నికల్లో డబ్బులు పంచి ఓటర్లను కొంటామని టీఆర్ఎస్ ధీమాతో ఉందని మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి ఆరోపించారు. ప్రజల డబ్బులే సీఎం కేసీఆర్ పంచిపెడుతాడని ఓటర్లకు చెప్పాల్సిన బాధ్యత పార్టీ శ్రేణులపై ఉందన్నారు. ఉద్యమ సమయంలో టీఆర్ఎస్ పార్టీకి డబ్బులు లేవని, అధికారంలోకి రాగానే ఇరిగేషన్ ప్రాజెక్టులు, కాంట్రాక్టుల కమీషన్ల పేరుతో కోట్లు దండుకున్నారని అన్నారు. తెలంగాణ ఏర్పడినప్పుడు రూ.60వేల కోట్లున్న అప్పు ఐదేళ్లలో రూ.3 లక్షల కోట్లకు పెంచిన ఘనత కేసీఆర్దేనని ఎద్దేవా చేశారు. ప్రతి ఒక్కరిపై రూ.లక్ష చొప్పున అప్పు కట్టేలా రాష్ట్రాన్ని దివాళా తీయించాడని అన్నారు. టీఆర్ఎస్కు బుద్ధి చెప్పేలా.. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ జెండా ఎగరేయాలని పెద్దపల్లి మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి పిలుపునిచ్చారు. మంగళవారం మంచిర్యాల జిల్లాలోని క్యాతన్పల్లి, చెన్నూరు మున్సిపాలిటీల్లో నిర్వహించిన మున్సిపల్ ఎన్నికల సన్నాహాక సమావేశాలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. బీజేపీని గెలిపిస్తే మున్సిపాలిటీలకు కేంద్రం నుంచి పెద్దఎత్తున నిధులు వస్తాయని చెప్పారు.
సింగరేణిపై కన్నేసిన సీఎం
ఆర్టీసీ సమ్మెను నిరంకుశంగా అణిచివేసిన కేసీఆర్ కన్ను ఇప్పుడు సింగరేణిపై పడిందని వివేక్ ఆరోపించారు. సింగరేణి ఆస్తులను దోచుకోవడం లక్ష్యంగా కార్మిక సంఘాలు లేకుండా చేసే కుట్రలు చేస్తున్నాడని అన్నారు. కారుణ్య నియామకాలను సక్రమంగా అమలు చేయడం లేదన్నారు. రాష్ట్రంలో నిరంకుశపాలన సాగిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ నిజాంను తలపిస్తున్నారని, ఆర్టీసీ సమ్మెను అణిచివేసి 35 మంది కార్మికుల చావుకు కారణమయ్యారని వివేక్ ఆరోపించారు. ఆర్టీసి సమ్మె సమయంలో రాష్ట్ర ప్రభుత్వం తప్పుడు అఫిడవిట్లను సమర్పించి హైకోర్టును తప్పుదోవ పట్టించిందని మండిపడ్డారు. బీజేపీ ఈ విషయాన్ని విడిచిపెట్టబోదని, కోర్టులో పిటిషన్ వేసి న్యాయ పోరాటం చేస్తామని అన్నారు. ఆర్టీసీని ప్రైవేటు పరం చేసి డబ్బులు దోచుకోవాలనుకున్న కేసీఆర్ను బీజేపీ అడ్డుకుందని తెలిపారు. సింగరేణి సంస్థ అభివృద్ధికి తమ కుటుంబం ఎంతో కృషి చేసిందని, దివంగత వెంకటస్వామి (కాకా) చేసిన సేవలను ఈ సందర్భంగా గుర్తు చేశారు.
కాళేశ్వరం నీళ్లు కేసీఆర్ ఫామ్ హౌజ్కు
కాళేశ్వరం నీళ్లను కేసీఆర్ వంద ఎకరాల ఫాంహౌజ్కు తరలించేందుకు కుట్రలు చేస్తున్నాడని ఆరోపించారు. సీఎం కావడానికి ముందు రెండు ఎకరాల ఫాంహౌజ్ ఇప్పుడు వంద ఎకరాలకు చేరిందని అన్నారు. కేంద్రం రెండు లక్షల ఇళ్లు మంజూరు చేస్తే కనీసం పదివేల ఇళ్లు కూడా కట్టించలేని సీఎం …తన కొడుకు కోసం రూ.100 కోట్లతో ప్రగతిభవన్ కట్టించాడన్నారు. అందరికి ఉద్యోగాలు, డబుల్ బెడ్రూం ఇండ్లు, నిరుద్యోగ భృతి, రిటైర్మెంట్ ఏజ్ పెంచుతానని, పెన్షన్ ఏజ్ తక్కువ చేస్తానని మభ్యపెట్టి ఎన్నికల్లో ఓట్లు వేయించుకున్నాడని విమర్శించారు. ఈ కార్యక్రమాల్లో బీజేపీ జిల్లా అధ్యక్షుడు ముల్కల మల్లారెడ్డి, చెన్నూరు, మంచిర్యాల నియోజకవర్గాల ఇన్చార్జులు అందుగుల శ్రీనివాస్, రఘునాథ్ వెరబెల్లి, జిల్లా జనరల్ సెక్రటరీ నగూనూరి వెంకటేశ్వర్గౌడ్, క్యాతన్పల్లి, చెన్నూర్ మున్సిపాలిటీల అధ్యక్షులు మహాంకాళీ శ్రీనివాస్, సుశీల్కుమార్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆరుముల్ల పోశం, నాయకులు దీక్షితులు, గుత్తుల ప్రసాద్ పాల్గొన్నారు.