అబద్ధాలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది : వినోద్​కుమార్

అబద్ధాలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది : వినోద్​కుమార్

కొత్తపల్లి, వెలుగు: అబద్ధాల పునాదులపై కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్​కుమార్ అన్నారు. తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించింది బంజారాలేనని, రానున్న ఎంపీ ఎన్నికల్లో తనకు ఓట్లు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. శుక్రవారం కొత్తపల్లి మండలం చింతకుంటలోని ఓ ఫంక్షన్​ హాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి ఎస్టీ సెల్ ప్రజాప్రతినిధులు, ముఖ్యనాయకుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణలో బీఆర్ఎస్​ను బొంద పెడతాం అని సీఎం రేవంత్​రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి మాట్లాడుతున్నారని, వీళ్లిద్దరి గురువులు వైఎస్.రాజశేఖర్​రెడ్డి, చంద్రబాబునాయుడుతోనే కాలేదని, వీళ్లతో ఏమవుతుందన్నారు. దేశంలో బీజేపీ మత రాజకీయాలు చేస్తోందని, ఎన్నికలు వచ్చినప్పుడు ఏదో ఒకటి చేసి ఓట్లు దండుకునే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు.

ఐదేళ్లలో బండి సంజయ్ తన పార్లమెంట్ పరిధిలోని గ్రామాలను పట్టించుకోలేదని, మళ్లీ ఏ ముఖం పెట్టుకుని ప్రజలను ఓట్లు అడుగుతాడని  ప్రశ్నించారు. కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ విజయ, బీఆర్ఎస్ కరీంనగర్, రాజన్న సిరిసిల్ల జిల్లాల అధ్యక్షులు జీవీ రామకృష్ణారావు, తోట ఆగయ్య, కార్మిక విభాగం మాజీ అధ్యక్షుడు రూప్ సింగ్, మాజీ మేయర్​రవీందర్​సింగ్, లీడర్లు తిరుపతినాయక్, రవినాయక్, తిరుపతినాయక్, రాజునాయక్, బీలునాయక్, లక్ష్మివీరునాయక్, మంగ, మానస తదితరులు పాల్గొన్నారు.