
- గౌడ కమ్యూనిటీ హాల్ కు మంత్రుల శంకుస్థాపన
- పాల్గొన్న మంత్రులు పొన్నం, పొంగులేటి, పీసీసీ చీఫ్ మహేశ్
ఖమ్మం టౌన్, వెలుగు : రాష్ట్రంలో ప్రజా సంక్షేమమే ప్రధాన ఎజెండాగా పాలన కొనసాగుతోందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. సోమవారం రాష్ట్ర బీసీ సంక్షేమం, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి, ఎమ్మెల్సీ, పీసీసీ చీఫ్ మహేశ్కుమార్గౌడ్, ఇతర ప్రజా ప్రతినిధులతో కలిసి ఖమ్మం జిల్లా రఘునాథపాలెంలో నిర్మించనున్న గౌడ సంఘ కమ్యూనిటీ హాల్ కు ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో నేతలు జ్యోతి ప్రజ్వలన చేసి, సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ఫొటోకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి మాట్లాడుతూ గతంలోని పెద్దలు ముందుచూపుతో రాష్ట్ర నలువైపులా నుంచి వచ్చే పేద విద్యార్థుల కోసం హైదరాబాద్ హిమాయత్ నగర్ లో కట్టిన గౌడ హాస్టల్ అనేక మంది మేధావులను తయారు చేసిందన్నారు. జిల్లా కేంద్రంలో అటువంటి భవన నిర్మాణానికి శంకుస్థాపన చేయడం సంతోషంగా ఉందన్నారు. పీసీసీ చీఫ్ మహేశ్కుమార్ గౌడ్ మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ఖమ్మం జిల్లా కంచుకోటగా ఉందన్నారు. రాజకీయంగా పరిణతి చెందిన జిల్లా ఖమ్మం అని, రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంలో ఈ జిల్లా కీలకపాత్ర పోషించిందని గుర్తు చేశారు.
గౌడ కమ్యూనిటీ హాల్ ను వచ్చే ఏడాది నాటికి పూర్తి చేసే బాధ్యత భట్టి, పొంగులేటి, తుమ్మలదేనన్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ గౌడ కమ్యూనిటీ హాల్ కు ఖమ్మం ఎంపీ రఘురాంరెడ్డి, రాజ్యసభ సభ్యుడు రవిచంద్ర, రేణుకాచౌదరి, మంత్రులు పొంగులేటి, తుమ్మల తలో రూ.50 లక్షలు, ఉప ముఖ్యమంత్రి భట్టి రూ.కోటి మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. భద్రాచలం ఆలయం వద్ద కూడా గౌడ సత్రం నిర్మించేందుకు సహకరించాలని కోరారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ గౌడ కమ్యూనిటీ భవన నిర్మాణానికి పూర్తి సహకారం అందిస్తామన్నారు. సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయి మాట్లాడుతూ గౌడ సోదరులకు కల్లు తీసే సమయంలో ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు ప్రభుత్వం కాటమయ్య రక్షణ కిట్లను పంపిణీ చేస్తోందని గుర్తుచేశారు.
వైరా ఎమ్మెల్యే మాలోతు రాందాస్ నాయక్ మాట్లాడుతూ గౌడ సంఘం సొసైటీలను తమ ప్రభుత్వ హయాంలోనే ఏర్పాటు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర హస్తకళల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ నాయుడు సత్యనారాయణ గౌడ్, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, తెలంగాణ రాష్ట్ర గౌడ సంఘం అధ్యక్షుడు పల్లె లక్ష్మణ్ గౌడ్, శ్రీ బాలాజీ ఎస్టేట్స్ అధినేత వత్సవాయి రవి పాల్గొన్నారు. ఈ సభకు ముందు ఖమ్మం నగరంలో గౌడ నేతల ఆధ్వర్యంలో ముఖ్య నేతలకు ఘన స్వాగతం పలికి, ర్యాలీ నిర్వహించారు.
సంక్షేమం, అభివృద్ధి ప్రభుత్వానికి రెండు కళ్లు
ఖమ్మం కార్పొరేషన్ : సంక్షేమం, అభివృద్ధి రాష్ట్ర ప్రభుత్వానికి రెండు కళ్లు అని టీపీసీసీ చీఫ్ మహేశ్కుమార్ గౌడ్ అన్నారు. ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం సంజీవరెడ్డి భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డిప్యూటీ సీం భట్టి, మంత్రి పొన్నం ప్రభాకర్ తో కలిసి ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 18 నెలల్లోనే రూ.లక్ష 75 వేల కోట్ల విదేశీ పెట్టుబడి తెచ్చామన్నారు. కార్పొరేషన్ చైర్మన్లు, డైరెక్టర్లు ఈ నెలలో పూర్తి చేస్తామన్నారు.
కులగణన చేయడంతో దేశానికే రోల్ మోడల్ గా నిలిచామని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో 90 సీట్లకు పైగా గెలిచి రెండోసారి అధికారంలోకి వస్తామని ధీమా చేశారు. భట్టి మాట్లాడుతూ కోటి కుటుంబాలకు సన్న బియ్యం ఇచ్చిన చరిత్ర దేశంలో ఏ ప్రభుత్వానికి లేదన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను వివరించారు. పొన్నం మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తా చాటాలన్నారు. ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకుపోవలసిన బాధ్యత అందరిపై ఉందన్నారు.