ఖమ్మం టౌన్/ కూసుమంచి/ గ్రేటర్ వరంగల్/ నల్లబెల్లి, వెలుగు: యువత డ్రగ్స్కు దూరంగా ఉండాలని ఆఫీసర్లు సూచించారు. సోమవారం ఖమ్మం జిల్లా కేంద్రంలోని స్టెమ్పార్క్ జూనియర్ కాలేజ్లో ఏసీపీ రమణమూర్తి, తిరుమలాయపాలెం మండల కేంద్రంలో స్థానిక పాఠశాలలో పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహించిన యాంటీ డ్రగ్స్ అవగాహన కార్యక్రమంలో ఏసీపీ తిరుపతిరెడ్డి పాల్గొని అవగాహన కల్పించారు. కాగా, వరంగల్ కలెక్టరేట్లో నార్కోటిక్ కో ఆర్డినేషన్ జిల్లా కమిటీ సమావేశాన్ని కలెక్టర్ సత్యశారద ఆధ్వర్యంలో డీసీపీ అంకిత్కుమార్, అడిషనల్ కలెక్టర్ సంధ్యారాణితో కలిసి నిర్వహించారు.
మత్తుపదార్థాల నియంత్రణపై చేపట్టాల్సిన కార్యక్రమాలపై మాట్లాడారు. అనంతరం నార్కోటిక్ వాల్పోస్టర్ను ఆవిష్కరించారు. నల్లబెల్లి, దుగ్గొండి మండల కేంద్రాల్లోని పాఠశాలల్లో ఎస్సైలు ప్రసన్నకుమార్, రణధీర్రెడ్డి అవగాహన కల్పించారు. జనగామ అర్బన్: జనగామ జిల్లా ధర్మకంచ జడ్పీహెచ్ఎస్, ప్రభుత్వ జూనియర్ కాలేజీలో డీసీపీ రాజమహేంద్రనాయక్ విద్యార్థులకు మాదకద్రవ్యాల నిర్మూలనపై అవగాహన కల్పించారు.
