- ఇయ్యాల కోర్టులో ప్రొడ్యూస్ చేసే అవకాశం
హైదరాబాద్, వెలుగు: నార్సింగి శ్రీచైతన్య కాలే జ్ స్టూడెంట్ నాగుల సాత్విక్(16) సూసైడ్ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. కాలేజీలో సిబ్బంది వేధిస్తున్నారని లెటర్ రాసి మంగళవారం రాత్రి సాత్విక్ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. సాత్విక్ తండ్రి రాజప్రసాద్ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు సెక్షన్ 305 ఐపీసీ కింద ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారు. ఈ కేసులో కాలేజీ యాజమాన్యం సహా మొత్తం ఐదుగురిని నిందితులుగా చేర్చారు. గురువారం హాస్టల్ స్టూడెంట్స్, వాచ్మెన్ స్టేట్మెంట్స్ రికార్డ్ చేశారు. వేధింపుల వల్లనే సాత్విక్ సూసైడ్ చేసుకున్నట్లు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియోస్ను స్టూడెంట్స్ వద్ద సేకరించారు. వైస్ ప్రిన్సిపాల్ ఆచార్య, లెక్చరర్ కృష్ణారెడ్డి, వార్డెన్ నరేశ్, శోభన్లను అదుపులోకి తీసుకున్నారు. వీరి స్టేట్మెంట్స్ రికార్డ్ చేశారు. 41 సీఆర్పీసీ కింద నోటీసులు జారీ చేశారు. శ్రీచైతన్య యాజమాన్యంపై తీసుకోవాల్సిన చర్యలపై లీగల్ ఒపీయన్ తీసుకుంటున్నారు. నిందితులను శుక్రవారం కోర్టులో ప్రొడ్యూస్ చేసేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు.
మంత్రి సబిత ఆఫీస్ ముట్టడి
శ్రీచైతన్య, నారాయణ వంటి కార్పొరేట్ విద్యా సంస్థల గుర్తింపు రద్దు చేయాలని కోరుతూ గురువారం విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆఫీస్ను ఎస్ఎఫ్ఐ, పీడీఎస్యూ, ఏఐఎఫ్డీఎస్ సంఘాలు ముట్టడించాయి. గేటు ముందు కూర్చొని ధర్నా చేశాయి. కాలేజీలు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విద్యార్థి సంఘాల నేతలు మండిపడ్డారు. తర్వాత నిరసనకారులను పోలీసులు అరెస్ట్ చేసి బేగంబజార్ పీఎస్కు తరలించారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ, పీడీఎస్యూ స్టేట్ లీడ ర్లు అశోక్రెడ్డి, గడ్డం శ్యామ్ మాట్లాడారు. వారం రోజుల్లో శ్రీచైతన్య విద్యా సంస్థల్లో ఇద్దరు స్టూడెంట్స్ చనిపోయారన్నారు.
ఇంటర్ బోర్డును ముట్టడించిన ఏబీవీపీ
రాష్ట్రంలో విద్యార్థుల ఆత్మహత్యలకు నిలయాలు గా మారిన కార్పొరేట్ కాలేజీల ఆగడాలను నియంత్రించాలని, పర్మిషన్ లేని కాలేజీలను మూసివేయాలని డిమాండ్ చేస్తూ ఏబీవీపీ కార్యకర్తలు ఇంటర్ బోర్డు ఆఫీసును ముట్టడించారు. గురువారం బోర్డు ముందు బైఠాయించి, సర్కారుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. లోపలికి చొచ్చుకుపోయేందుకు ఏబీవీపీ లీడర్లు ప్రయత్నించగా పోలీసులు వారిని అడ్డుకొని, అరెస్ట్ చేశారు. ఏబీవీపీ రాష్ట్ర సహాయ కార్యదర్శి కమల్ సురేష్ మాట్లాడుతూ.. నార్సింగ్ లోని శ్రీచైతన్య కాలేజీలో చదువుతున్న సాత్విక్ ప్రిన్సిపల్ వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడని, బాధిత కుటుంబానికి ప్రభుత్వం న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
ఇంటర్ బోర్డు ముందు ఆప్ ఆందోళన
కార్పొరేట్ కాలేజీల్లో విద్యార్థుల ఆత్మహత్యల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని ఇంటర్ బోర్డు ముందు ఆప్ ఆందోళన చేపట్టింది. పోలీసులు వారిని అడ్డుకొని, స్టేషన్కు తరలించారు.
సాత్విక్ మృతికి కారకులను కఠినంగా శిక్షించాలి
శ్రీచైతన్య కాలేజీ ముందు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ధర్నా
గండిపేట, వెలుగు: శ్రీచైతన్య కాలేజీలో ఆత్మహత్య చేసుకున్న సాత్విక్ కుటుంబానికి న్యాయం జరి గేంత వరకు అండగా ఉంటామని నల్గొండ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు. నార్సింగిలోని కాలేజీ ముందు గురువారం ఆయన ధర్నా చేశారు. స్టూడెంట్ చనిపోతే పోలీసులు కాలేజీకి సెక్యూరిటీగా ఉన్నారని, బాధితులను గాలికి వదిలేశారని విమర్శించారు. సాత్విక్ సూసైడ్కు కారణమైన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. వారికి శిక్ష పడేంత వరకు ఆందోళన కొనసాగిస్తూనే ఉంటామని హెచ్చరించారు. తర్వాత కాలేజీ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఎంపీ వెంకట్రెడ్డి పోలీసులతో వాగ్వాదానికి దిగారు. నిందితులను అరెస్ట్ చేసి కఠినంగా శిక్షిస్తామని ఏసీపీ జీవీ రమణ హామీ ఇవ్వడంతో ఆయన ఆందోళన విరమించారు.