మెదక్ జిల్లాలో వేర్వేరు ఘటనల్లో నలుగురు మృతి

మెదక్ జిల్లాలో వేర్వేరు ఘటనల్లో నలుగురు మృతి
  •  ముంబై సముద్రంలో కొట్టుకుపోయి మెదక్ జిల్లా యువకుడు మృతి

రామాయంపేట, వెలుగు: కుటుంబంతో కలిసి టూర్​కు వెళ్లిన యువకుడు గురువారం సాయంత్రం ప్రమాదవశాత్తు సముద్రంలో కొట్టుకుపోయి మృతి చెందాడు. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. మెదక్ జిల్లా రామాయంపేట ఎస్సీ కాలనీకి చెందిన టంకరి రాము (34) కుటుంబ సభ్యులతో కలిసి ముంబాయికి వెళ్లాడు. అక్కడ సరదాగా బోట్ లో సముద్రంలో కొద్ది సేపు విహరించి ఒడ్డుకు చేరుకున్నారు.

బోటు దిగి నిల్చుండగా అనూహ్యంగా ఒక్కసారిగా పెద్ద అల రావడంతో దాని దాటికి రాము సముద్రంలోకి కొట్టుకుపోయాడు. ఎంతకీ అతడి ఆచూకీ లభించలేదు. దీంతో రాము కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగి పోయారు. అప్పటి వరకు తమతో ఉన్న రాము క్షణాల్లో సముద్రంలోకి కొట్టుకుపోవడంతో వారు తట్టుకోలేకపోయారు. రాము మృతి విషయం తెలిసి రామాయంపేట ఎస్సీ కాలనీలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

చేపల వేటకు వెళ్లి బాలుడు.. 

అల్లాదుర్గం: చేపల వేట కోసం వెళ్లి బాలుడు మృతి చెందిన ఘటన అల్లాదుర్గం మండలంలో జరిగింది. ఎస్ఐ శంకర్ కథనం ప్రకారం.. అప్పాజీ పల్లి గ్రామానికి చెందిన సాయిలుకు ఇద్దరు కొడుకులు.  చిన్న కొడుకు సతీశ్ (14) గ్రామ శివారులోని రేలా కుంటలో శుక్రవారం చేపలు పట్టడానికి వెళ్లి కుంటలో  మునిగి మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని గ్రామస్తుల సాయంతో మృతదేహాన్ని బయటకు తీశారు. పోస్టుమార్టం కోసం జోగిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడు తండ్రి సాయిలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. 

ఉరి వేసుకొని యువకుడు..  

మనోహరాబాద్: కుటుంబ గొడవల కారణంగా యువకుడు సూసైడ్​చేసుకున్న ఘటన మండలంలోని వెంకటాపూర్​ అగ్రహారంలో జరిగింది. ఎస్ఐ సుభాష్ గౌడ్ కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన చిన్న బత్తుల ఆంజనేయులు(35) ఉదయం పాలు తీసుకువస్తానని చెప్పి రాత్రి అయినా ఇంటికి రాలేదు. కుటుంబ సభ్యులు చుట్టు పక్కల, పొలం వద్ద వెతకగా వేప చెట్టుకు ఉరి వేసుకొని చనిపోయి కనిపించాడు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో ఘటనా స్థలానికి వచ్చి డెడ్​బాడీని పోస్టుమార్టం కోసం తూప్రాన్​ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆంజనేయులు భార్య నవనీత ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. 

మొన్న భర్త.. ఇప్పుడు  భార్య మృతి

శివ్వంపేట: కూతురికి బాల్య వివాహం చేసిన నేపథ్యంలో  దంపతులు ఆత్మహత్యకు పాల్పడగా  8 రోజుల కింద భర్త మృతిచెందగా గురువారం రాత్రి భార్య మృతి చెందింది. శివ్వంపేట మండలం పోతులబోగూడ  గ్రామానికి చెందిన పందుల శివకుమార్ (40),  అతడి భార్య శోభ (35) పది రోజుల కింద పాపన్నపేట మండలం ఏడుపాయల్లో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. స్థానికులు గుర్తించి చికిత్స కోసం గాంధీ ఆస్పత్రికి తరలించగా మరుసటి రోజు శివకుమార్ మృతిచెందాడు. చికిత్స పొందుతూ అతడి భార్య శోభ గురువారం మృతి చెందడంతో శుక్రవారం గ్రామంలో అంత్యక్రియలు నిర్వహించారు. పది రోజుల వ్యవధిలో భార్య భర్తలు చనిపోవడంతో గ్రామంలో విషాదం నెలకొంది.