- జగిత్యాలలో మరో ఘటన .. మత్తులో మైనర్ల హంగామా
- కర్రలు, బండలతో ఒకరిపై ఒకరి దాడి
- రెస్క్యూ చేసేందుకు వచ్చిన
- చైల్డ్ వెల్ఫేర్ సిబ్బందిపైనా అటాక్
- అదుపులో ఒకరు..పారిపోయిన మరో ముగ్గురు
జగిత్యాల, వెలుగు: జగిత్యాల జిల్లా కేంద్రంలో మత్తుకు బానిసలుగా మారి ఓ బాలికపై లైంగికదాడి చేసిన ఘటన మరువక ముందే మంగళవారం నలుగురు మైనర్లు మత్తులో హంగామా సృష్టించారు. దీన్ని కొందరు వీడియోలు తీయడంతో పాటు1098కు కాల్ చేసి చెప్పారు. దీంతో రెస్క్యూ చేసేందుకు వచ్చిన సిబ్బందిపైనా పిల్లలు దాడికి యత్నించారు. ఎట్టకేలకు వారు ఒకరిని పట్టుకోగా, మరో ముగ్గురు పరారయ్యారు. స్థానికులు, చైల్డ్వెల్ఫేర్ఆఫీసర్ల కథనం ప్రకారం..జగిత్యాల పట్టణంలోని మహాలక్ష్మినగర్ బైపాస్ దగ్గర మంగళవారం సాయంత్రం 10 నుంచి 12 ఏండ్ల మధ్య వయస్సున్న నలుగురు పిల్లలు విచిత్రంగా ప్రవర్తిస్తూ కనిపించారు. మత్తులో తూలుతూ..అరుస్తూ కొన్ని ఇండ్ల ముందు నిలిపిన టూ వీలర్లను తన్ని కింద పడేశారు. సమీపంలో నిర్మాణంలో ఉన్న ఇంటి ఆవరణలో నిల్వ ఉన్న బురద నీళ్లలో స్నానాలు చేశారు. అక్కడే ఉన్న ఇసుక కుప్పల వద్ద కేకలు వేస్తూ రాళ్లు, కర్రలు, ఇటుకలతో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఇది చూసిన కొందరు స్థానికులు చిల్డ్రన్ హెల్ప్ లైన్ నంబర్1098 కు కాల్చేసి చెప్పారు. వారికి వాహనం అందుబాటులో లేకపోవడంతో ఇద్దరు సిబ్బంది ఆటోలో సుమారు అరగంట తర్వాత అక్కడికి చేరుకున్నారు. అప్పటికే మత్తులో ఉన్న పిల్లల్లో ఒకరు చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ సిబ్బందిని ఇటుకలతో కొట్టడానికి ప్రయత్నించాడు. ఎలాగో కష్టపడి అతడిని పట్టుకోగా, మరో ముగ్గురు పారిపోయారు.
క్లోరోఫామ్ తీసుకున్నడు
ఘటనపై జగిత్యాల జిల్లా సీడబ్ల్యూసీ ఇన్చార్జి చైర్ పర్సన్ ధనలక్ష్మిని వివరణ కోరగా..రెస్క్యూ చేసిన బాలుడు మత్తులో ఉన్నాడని, కల్లులో మత్తు కలిగించేందుకు వాడే క్లోరోఫాం తీసుకున్నట్లు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చామన్నారు. బాలుడు గంజాయి కూడా తీసుకున్నట్టు అనుమానం కలుగుతోందన్నారు. ఎంక్వైరీలో అన్ని విషయాలు తెలుస్తాయన్నారు. పిల్లలకు క్లోరోఫాం ఇచ్చిన వారికి నోటీస్ ఇస్తామన్నారు. పిల్లవాడి మత్తు దిగిన తర్వాత కౌన్సిలింగ్ ఇచ్చి బాలుడి కుటుంబసభ్యులకు అప్పగిస్తామన్నారు. ఒకవేళ పిల్లవాడిని పోషించే స్థితిలో లేకపోతే హోంలో ఉంచుతామన్నారు.
మత్తు పదార్థాలు తీసుకుంటున్న వీడియోలు వెలుగులోకి..
నాలుగు రోజుల క్రితం జగిత్యాలలోని స్కూల్ బంగ్లాపై మైనర్లు మత్తు పదార్థాలు తీసుకుంటున్న వీడియోలు సోషల్మీడియాలో వైరలవుతున్నాయి. ప్రతి రోజు స్కూల్ బంగ్లాపై కొందరు స్టూడెంట్లు అడ్డాలు వేస్తుండడంతో అనుమానం వచ్చిన స్థానికులు అక్కడికి వెళ్లి సీక్రెట్గా వీడియోలు తీశారు. కవర్లలో మత్తు పదార్థాలు తీసుకుంటున్న మైనర్లు కనిపించారు. వీడియో తీయడాన్ని చూసిన పిల్లలు పారిపోయే ప్రయత్నం చేయగా పట్టుకున్నారు. జేబుల్లో వెతకగా కొన్ని కవర్లతో పాటు పంక్చర్ అయిన ట్యూబులను, లెదర్ వస్తువులను అతికించడానికి వాడే కెమికల్ దొరికింది. ఈ కెమికల్ను కవర్లలో పెట్టి పీల్చడం వల్ల మత్తెక్కుతున్నట్టు తెలిసింది. ఇది ఆరోగ్యంపై తీవ్ర దుష్ప్రభావాన్ని చూపుతుంది. ఊపిరితిత్తులతో పాటు శరీరంలోని ఇతర అవయవాలను నాశనం చేస్తుంది. అయినా మత్తుకు బానిసైన పిల్లలు వీటిని ఎక్కువగా
వాడుతున్నారు.