సభ్య సమాజం తలదించుకునే ఘటనలు దేశంలో పుట్టుకొస్తూనే ఉన్నాయి. మహిళలపై వేధింపులు, అవమానాలు, అసభ్య ప్రవర్తన వంటి సంఘటనలు రోజురోజుకూ పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. లేటెస్ట్గా ఓ మహిళ నటికి జరిగిన అవమానకర ఘటన మరోసారి సమాజంలోని వికృత మనస్తత్వాన్ని బయటపెట్టింది. వివరాల్లోకి వెళితే..
ప్రముఖ టూత్పేస్ట్ బ్రాండ్ సెన్సోడైన్ యాడ్లో మలయాళం నటి, రచయిత్రి, దర్శకురాలు దివ్య ఉన్ని నటించింది. అయితే ఆమె ఫోటో ఉన్న పోస్టర్పై కొందరు వ్యక్తులు పాన్ ఉమ్మిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ఈ ఘటనను ఖండించారు. అలాగే దీనిపై నటి ఎలా స్పందిస్తారో తెలుసుకోవాలని ఆసక్తి చూపించడంతో, దివ్య స్పందన ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
ఈ నేపథ్యంలో ఇన్స్టాగ్రామ్లో స్పందించిన దివ్య ఉన్ని.. ఈ ఘటనను కేవలం తన వ్యక్తిగత అవమానంగా చూడలేనని స్పష్టం చేశారు. ‘ఆ పోస్టర్లో ఉన్నది కేవలం దివ్య ఉన్ని ముఖం మాత్రమే కాదు.. అది ఏ మహిళ ముఖమైనా కావచ్చు. అందుకే దీనిని వ్యక్తిగతంగా తీసుకోవడం లేదు. అయితే ఈ ఘటన బాధ కలిగించలేదని చెప్పలేను’ అని పేర్కొన్నారు.
ALSO READ ; వివాదాల మధ్య ఎన్టీఆర్ మూవీ.. రుద్రప్రయాగలోనే షూటింగ్కు కారణమేంటి?
అలాగే అదే గోడపై పలువురు పురుష రాజకీయ నాయకుల పోస్టర్లు కూడా ఉన్నాయి. కానీ వాటిని వదిలేసి, మహిళ ఫోటో ఉన్న ప్రకటననే లక్ష్యంగా చేసుకోవడం ఆలోచించాల్సిన విషయం అని, మహిళలను గౌరవించని మనస్తత్వం మారాలని దివ్య ఖరాకండిగా వీడియో ద్వారా స్పష్టం చేసింది. ఈ క్రమంలోనే ఇలాంటి అంశాలపై సినిమాలు తీసి అవగాహన కల్పించేందుకు ప్రయత్నిస్తానని దివ్య వెల్లడించింది.
అదే సమయంలో, దేశంలో మహిళలు నిత్యం ఎదుర్కొంటున్న హింస, అవమానాలు, వివక్షతో పోలిస్తే ఈ ఘటన చాలా చిన్నదని ఆమె అభిప్రాయపడ్డారు. ‘చిన్నారుల నుంచి వృద్ధ మహిళల వరకు ఎందరో ఎన్నో రకాల హింసను ఎదుర్కొంటున్నారు. వారితో పోలిస్తే నా విషయంలో జరిగినది కేవలం కొందరు పాన్ ఉమ్మిన ఘటన మాత్రమే’ అని అన్నారు.
మహిళలను సమానమైన మనుషులుగా చూసే దృక్పథం సమాజంలో పెరగాలి. మహిళల జీవితాలను ప్రతిబింబించే కథలతో సినిమాలు తీసి ఆలోచనా విధానంలో మార్పు తీసుకురావడానికి ప్రయత్నిస్తాను" అని నటి దివ్య ఉన్ని తెలిపారు. ప్రస్తుతం దివ్య ఇచ్చిన ఈ స్ట్రాంగ్ స్టేట్ మెంట్కు సోషల్ మీడియాలో విస్తృత మద్దతు లభిస్తోంది.
పోస్టర్లపై పేడ జల్లడం సరికాదు: సీనియర్ ఎన్టీఆర్
ఒకప్పుడు సినిమా హీరోల అభిమానుల మధ్య పోటీలు తీవ్ర స్థాయిలో ఉండేవి. కొంతమంది అభిమానులు ప్రత్యర్థి హీరోల పోస్టర్లపై పేడ జల్లడం వంటి అనుచిత చర్యలకు కూడా పాల్పడేవారు. అయితే అలాంటి ప్రవర్తనను స్వయంగా ఎన్టీఆర్ తీవ్రంగా తప్పుబట్టారు.
ఓసారి సినిమా శతజయంతి వేడుకల్లో మాట్లాడిన ఎన్టీఆర్.. "అభిమానులు ఎంతో కష్టపడి పేడ సేకరించి, ఎవరూ చూడకుండా మరో హీరో పోస్టర్పై వేయడం ఏమాత్రం సరైన పని కాదు. అభిమానాన్ని ఇలాంటి చర్యలతో చూపించకూడదు" అని హితవు పలికారు. అదే ప్రసంగంలో ఆయన మరో ఆసక్తికర విషయాన్ని కూడా పంచుకున్నారు. "నేను, ఏఎన్నార్ చాలా మంచి స్నేహితులం. ఆ విషయం చాలామందికి తెలియదు" అంటూ ఇద్దరి మధ్య ఉన్న అనుబంధాన్ని గుర్తు చేశారు.
ఇక ఎన్టీఆర్ జీవితంలోని చివరి రోజుల గురించి కూడా ఒక సంఘటన తరచూ ప్రస్తావనకు వస్తుంది. ఆయన మరణానికి కొద్ది గంటల ముందు రాత్రి, స్వయంగా అడిగి మరీ ఏఎన్నార్కు ఫోన్ చేసి, "బ్రదర్... చాలా రోజులైంది మాట్లాడి. త్వరలో కలుద్దాం" అని ఆప్యాయంగా మాట్లాడినట్లు చెబుతారు. ఇద్దరు దిగ్గజాల మధ్య ఉన్న స్నేహానికి ఇది ఒక చిరస్మరణీయ ఉదాహరణగా అభిమానులు గుర్తుచేసుకుంటుంటారు. అప్పట్లో పేడ.. ఇప్పుడు పాన్.. ఇలా ఈ రెండు ఘటనలు మహిళ గౌరవం నుంచి అభిమానుల బాధ్యత వరకు గుర్తుకుతెస్తున్నాయి. ఇలా నటి దివ్య ఉన్ని ఘటనతో ఎన్టీఆర్ వ్యాఖ్యలు కూడా వైరల్ అవుతున్నాయి.
