జనగామ టీఆర్ఎస్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి ఇంట్లో ఐదుగురికి కరోనా వైరస్ సోకింది. నిన్న ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. దీంతో ఆయన కుటుంబ సభ్యులను, సిబ్బందిని అధికారులు హోం క్వారంటైన్ చేశారు. వారందరి శాంపిల్స్ సేకరించి టెస్టులు చేయగా మరో నలుగురికి పాజిటివ్ వచ్చింది. ఎమ్మెల్యే ముత్తి రెడ్డి భార్య పద్మలతా రెడ్డి, వంట మనిషి, గన్మెన్, డ్రైవర్కు కరోనా సోకినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ ముత్తిరెడ్డి భార్య వాయిస్ మెసేజ్ను విడుదల చేశారు. అంతా ఆరోగ్యంగానే ఉన్నామని, అభిమానులెవరూ అధైర్యపడొద్దని ఆమె కోరారు.
మాకు లక్షణాలు లేవు: ఎమ్మెల్యే భార్య
ఎమ్మెల్యే ముత్తిరెడ్డి సహా ఇప్పుడు మొత్తం ఐదుగురికి కరోనా సోకిందని ఆయన భార్య పద్మలతా రెడ్డి తెలిపారు. అయితే తమలో ఎవరికీ లక్షణాలు లేవని, హోం క్వారంటైన్లో ఉండి తమ పనులు తాము చేసుకుంటున్నామని చెప్పారామె. మొదట్లో ఒకటి రెండ్రోజులు మాత్రమే ఒళ్లు నొప్పులుగా అనిపించిందని, ఇప్పుడు అలా కూడా ఏమీ లేదని అన్నారు. ఆరోగ్యపరంగా ప్రస్తుతం ఏ సమస్యలూ లేవని, అంతా బాగానే ఉన్నామని, తమ పనులు తాము చేసుకుంటున్నామని చెప్పారు. తాము ఎటువంటి ఆందోళన చెందడం లేదని, ఆరోగ్య శాఖ అధికారులు కూడా ఫోన్ చేశారని, ఎటువంటి భయం లేదని చెప్పారని అన్నారు. ప్రస్తుతం ఎటువంటి మందులు కూడా అవసరం లేదని, ఇంట్లోనే ఐసోలేషన్లో ఉంటే సరిపోతుందని చెప్పారన్నారు.