- నాలుగు ప్రమాదాల్లో ఎనిమిది మంది మృతి
- నిర్మల్ జిల్లాలో పెండ్లికి వెళ్తున్న వాహనం బోల్తా, ఇద్దరు మృతి, 15 మందికి గాయాలు
- ఖమ్మం జిల్లాలో ఇద్దరు, మహబూబాబాద్ జిల్లాలో మరో ఇద్దరు..
- శంషాబాద్ పరిధిలో బైక్ను ఢీకొట్టిన లారీ, ఇద్దరు స్టూడెంట్లు మృతి
నిర్మల్, వెలుగు : టైర్ పేలి మాక్స్ వాహనం బోల్తా పడడంతో ఇద్దరు అక్కడికక్కడే చనిపోగా, 15 మంది గాయపడ్డారు. ఈ ప్రమాదం నిర్మల్ సమీపంలోని కొండాపూర్ వద్ద నేషనల్ హైవేపై గురువారం జరిగింది. పోలీసులు, కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం...
ఆదిలాబాద్ జిల్లా సోంపల్లి గ్రామానికి చెందిన 20 మంది బొలెరో మాక్స్ వాహనంలో ఆర్మూర్లో పెండ్లికి వెళ్తున్నారు. కొండాపూర్ సమీపంలోకి రాగానే వాహనం టైర్ పేలడంతో అదుపుతప్పి పల్టీ కొట్టింది. ప్రమాదంలో సోంపల్లి గ్రామానికి చెందిన లక్ష్మణ్ (60), తులసీదాస్ (38) అక్కడికక్కడే చనిపోగా, మరో 15 మందికి గాయాలు అయ్యాయి.
ప్రమాదాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమచారం ఇవ్వడంతో వారు ఘటనాస్థలానికి చేరుకొని గాయపడిన వారిని నిర్మల్ హాస్పిటల్కు తరలించారు. గాయపడిన వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉండడంతో వారిని అదిలాబాద్లోని రిమ్స్కు తరలించారు.
మహబూబాబాద్ జిల్లాలో...
మరిపెడ, వెలుగు : మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం లచ్యాతండా పరిధిలో బైక్ను గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో ఇద్దరు యువకులు చనిపోయారు. మండలంలోని గాలివారిగూడెంనకు చెందిన ఉదయ్ కిరణ్ (21), బిక్షం (22) బైక్పై మహబూబాబాద్ నుంచి మరిపెడ వైపు వస్తున్నారు.
లచ్యాతండా సమీపంలోకి రాగానే బైక్ను గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో ఇద్దరు అక్కడికక్కడే చనిపోయారు. ప్రమాదానికి కారణమైన వాహనాన్ని గుర్తించేందుకు సీసీ ఫుటేజీలను పరిశీలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ఎగ్జామ్కు వెళ్తూ ఇంటర్ స్టూడెంట్స్..
శంషాబాద్, వెలుగు : ఎగ్జామ్కు వెళ్తుండగా జరిగిన ప్రమాదంలో ఇద్దరు ఇంటర్ స్టూడెంట్స్ చనిపోయారు. ఈ ఘటన శంషాబాద్ రూరల్ పీఎస్ పరిధిలోని పెద్ద షాపూర్ వద్ద గురువారం జరిగింది. కొత్తూరుకు చెందిన విక్కీ సింగ్ (22), సూరజ్ (17) గురువారం శంషాబాద్లోని ఓ ప్రైవేట్ కాలేజీలో ఇంటర్ ఎగ్జామ్ రాసేందుకు బైక్పై బయలుదేరారు. పెద్దషాపూర్ వద్దకు రాగానే ఎదురుగా వచ్చిన లారీ ఢీకొట్టడంతో ఇద్దరు అక్కడికక్కడే చనిపోయారు.
ఖమ్మం జిల్లాలో ఇద్దరు...
సత్తుపల్లి, వెలుగు : లారీ రెండు బైక్లను ఢీకొట్టడంతో ఇద్దరు వ్యక్తులు చనిపోయారు. ఈ ప్రమాదం ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం నారాయణపురం గ్రామంలో గురువారం జరిగింది. పెనుబల్లి మండలం మండాలపాడుకు చెందిన పానెం సులోమాన్ (57), సత్తుపల్లి మండలం రేజర్లకు చెందిన సాలి నాగేశ్వరరావు (60) వేర్వేరు బైక్లపై డీఎన్ఆర్పేట నుంచి సత్తుపల్లి వెళ్తున్నారు. నారాయణపురం వద్దకు రాగానే రెండు బైక్లను లారీ ఢీకొట్టింది. దీంతో సులోమాన్, నాగేశ్వరరావు అక్కడికక్కడే చనిపోయారు.
