- 20వ ప్లేస్లో మురళీ దివి.. ఆస్తి 45,460 కోట్లు
- 43వ స్థానంలో డాక్టర్ రెడ్డీస్ ఫ్యామిలీ.. ఆస్తి 23,830 కోట్లు
- మేఘా కృష్ణారెడ్డి ఫ్యామిలీకి 45వ ర్యాంకు
- వాళ్ల ఆస్తులు 22,731 కోట్లు
- కాళేశ్వరంతో పాటు మిషన్ భగీరథ ప్రాజెక్టూ మేఘాకే
- అరబిందో రాంప్రసాద్కు 49వ ర్యాంకు.. ఆస్తి 22 వేల కోట్లు
న్యూఢిల్లీ: ఫోర్బ్స్ ఇండియా టాప్ 100 లిస్టులో నలుగురు తెలుగోళ్లకు చోటు దక్కింది. దివిస్ లేబొరేటరీస్ ఓనర్ మురళీ దివి దేశంలోని సంపన్నుల జాబితాలో 20వ ర్యాంకు దక్కించుకున్నారు. తెలుగు రాష్ట్రాల పరంగా చూస్తే ఆయనే నంబర్ వన్ సంపన్నుడిగా నిలిచారు. డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ ఫ్యామిలీ (జాయింట్గా) 43వ ర్యాంకు దక్కించుకుంది. మేఘా సంస్థ యజమాని పీపీ రెడ్డి కుటుంబం 45వ స్థానంలో నిలిచింది.
మేఘా కంపెనీని ప్రస్తుతం పీపీ రెడ్డి అల్లుడు పీవీ కృష్ణారెడ్డి నిర్వహిస్తున్నారు. ఫోర్బ్స్ వరల్డ్ లిస్టులో పీపీ రెడ్డితో పాటు పీవీ కృష్ణారెడ్డి కూడా చోటు దక్కించుకున్నారు. ఇక, అరబిందో ఫార్మా కో ఫౌండర్ పీవీ రాంప్రసాద్రెడ్డి దేశంలోని సంపన్నుల జాబితాలో 49వ స్థానాన్ని సంపాదించారు.
పీవీ రాంప్రసాద్ రెడ్డి
ఫోర్బ్స్ ఇండియా ర్యాంక్ 49;
వరల్డ్ ర్యాంక్ 1513
నికర ఆస్తులు దాదాపు రూ.22 వేల కోట్లు
(300 కోట్ల డాలర్లు)
అరబిందో ఫార్మా కంపెనీ కో ఫౌండర్ పీవీ రాంప్రసాద్ రెడ్డి. 1986లో కంపెనీని ఏర్పాటు చేశారు. షుగర్, గుండె తదితర జబ్బులకు మందులను తయారు చేస్తున్నారు. కంపెనీ ఆదాయంలో 75 శాతం వరకు అమెరికా, యూరప్ నుంచే వస్తోంది. రెగ్యులేటరీ అనుమతులను లేట్ చేస్తుండడంతో ఈ ఏడాది ఏప్రిల్లో శాండోజ్ఓరల్ సాలిడ్స్, డెర్మటాలజీ బిజినెస్ డీల్ నుంచి సంస్థ తప్పుకుంది.
మురళీ దివి అండ్ ఫ్యామిలీ
ఫోర్బ్స్ ఇండియా ర్యాంకు 20;
వరల్డ్ ర్యాంకు 538
నికర ఆస్తులు సుమారు రూ.45,460 కోట్లు(620 కోట్ల డాలర్లు)
దివిస్ లేబొరేటరీస్.. అతిపెద్ద బల్క్ డ్రగ్ తయారీ కంపెనీల్లో ఒకటి. రాష్ట్రంలోనే అతి పెద్దది. అమెరికాలో సైంటిస్టుగా ట్రె యిన్ అయిన మురళి (69).. 30 ఏళ్ల క్రితం మందుల రీసెర్చ్ కంపెనీగా దివిస్ను ఏర్పాటు చేశారు. ఇప్పుడది యాక్టి వ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రెడియెంట్స్ (ఏపీఐ– మందుల తయారీకి వాడే ముడి ఔషధం)ను ప్రపంచానికి ఎగుమతి చేసే స్థాయికి ఎదిగింది. పెద్ద కంపెనీలకు మందులను కూడా తయారు చేసి ఇస్తోంది. న్యూట్రాస్యూటికల్స్(విటమిన్ సప్లిమెంట్లు, పోషకాలు, ఫోర్టిఫైడ్ పాల ఉత్పత్తులు, సిరీల్స్వంటివి)నూ ప్రొడ్యూస్ చేస్తోంది. కంపెనీకి ఏటా వచ్చే ఆదాయంలో 80 శాతానికి పైగా విదేశీ ఎగుమతుల నుంచే వస్తోంది.
డాక్టర్ రెడ్డీస్ ఫ్యామిలీ
ఫోర్బ్స్ ఇండియా ర్యాంక్ 43;
నికర ఆస్తులు రూ.23,830 కోట్లు
(325 కోట్ల డాలర్లు)
డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్.. పసుపు రైతు కొడుకు అయిన దివంగత కె. అంజిరెడ్డి 1984లో జనరిక్స్, ఫార్మా ఇంగ్రెడియెంట్స్ తయారీ కోసం పెట్టిన కంపెనీ. ప్రస్తుతం కంపెనీని ఆయన కొడుకు సతీశ్ రెడ్డి నిర్వహిస్తున్నారు. చైర్మన్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. సతీశ్ రెడ్డి అల్లుడు జీవీ ప్రసాద్ కో చైర్మన్గా ఉన్నారు. ఇండియాలోనే కాకుండా విదేశాల్లోనూ మందులను తయారుచేస్తోంది రెడ్డీస్. ప్రస్తుతం కరోనా కోసం ఫావిపిరావిర్ మందునూ మార్కెట్ చేస్తోంది. అందుకు జపాన్కు చెందిన ఫ్యూజీఫిల్మ్ తొయామా కెమికల్తో ఒప్పందం కూడా చేసుకుంది. రష్యా వ్యాక్సిన్ స్పుత్నిక్ Vని ఇండియాలో మార్కెట్ చేసేందుకు ఆ దేశానికి చెందిన సావరిన్ వెల్త్ ఫండ్.. రెడ్డీస్తో ఒప్పందం కుదుర్చుకుంది. ఒప్పందంలో భాగంగా 10 కోట్ల డోసులను దేశంలో డిస్ట్రిబ్యూట్ చేయనుంది.
పీపీ రెడ్డి అండ్ ఫ్యామిలీ
ఫోర్బ్స్ ఇండియా ర్యాంక్ 45;
వరల్డ్ ర్యాంక్ 1,335
నికర ఆస్తులు రూ.22,731 కోట్లు
(310 కోట్ల డాలర్లు)
ఫోర్బ్స్ వరల్డ్ లిస్టులో
పీపీ రెడ్డి ఆస్తులు రూ.11,732 కోట్లు
(160 కోట్ల డాలర్లు)
పీవీ కృష్ణా రెడ్డి ఆస్తులు రూ.11,732 కోట్లు (160 కోట్ల డాలర్లు-ర్యాంకు 1,335)
రైతు కుటుంబంలో పుట్టిన పీపీ రెడ్డి 1989లో మున్సిపాలిటీల కోసం చిన్న పైపులను తయారు చేసే మేఘా ఇంజనీరింగ్ ఎంటర్ప్రైజెస్ అనే సంస్థను ఏర్పాటు చేశారు. తర్వాత అతి తక్కువ కాలంలోనే వ్యాపారాన్ని మౌలిక వసతుల ప్రాజెక్టులు, డ్యామ్ల నిర్మాణం, సహజ వాయువు డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్స్, పవర్ ప్లాంట్లు, రోడ్ల నిర్మాణానికి విస్తరించారు. 1991లో కంపెనీ బాధ్యతలను ఆయన మేనల్లుడు పీవీ కృష్ణారెడ్డి చేపట్టారు. అప్పటి నుంచి ఆయనే కంపెనీని నిర్వహిస్తున్నారు. 2006లో కంపెనీ పేరును మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్గా మార్చారు. 2014 తర్వాత కంపెనీ సంపద భారీగా పెరిగింది. ప్రస్తుతం తెలంగాణలో రూ.లక్షా 2 వేల 666 కోట్లు విలువైన (ఫోర్బ్స్ లెక్క ప్రకారం) కాళేశ్వరం ప్రాజెక్టును కడుతున్నది ఆ కంపెనీనే. మిషన్ భగీరథ పనులూ ఆ కంపెనీవే. ఏపీలో పట్టిసీమ ప్రాజెక్టుతో పాటు పోలవరం ప్రాజెక్టులోనూ కొన్ని పనులను దక్కించుకుంది. ఇప్పుడు సంగమేశ్వరం కాంట్రాక్టునూ సొంతం చేసుకుంది. అతి తక్కువ టైంలోనే ఇన్ని పెద్ద ప్రాజెక్టులు చేపట్టడంతో ఫ్యామిలీ ఆస్తులు భారీగా పెరిగాయి.