తెలంగాణలోని పలు పెట్రోల్ బంకులు వినియోగదారులను మోసం చేస్తున్న తీరు పలుచోట్ల బయటపడుతూనే ఉన్నాయి. కొందరు బంకు యజమానులు ఎలక్ట్రానిక్ చిప్ లను అమర్చి పెట్రోల్ పోస్తూ వాహనదారుల జేబులకు చిల్లులు పెడుతున్నారు. ప్రభుత్వం ఎన్ని రకాలుగా చర్యలు తీసుకుంటున్నా... వినియోగదారులు మాత్రం మోసపోతున్నారు. ప్రైవేట్ బంకుల్లోనే కాదు..ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహిస్తోన్న పెట్రో బంకుల్లో కూడా మోసాలు బయటపడడం కలకలం రేపుతోంది. తాజాగా నల్లగొండ జైళ్ల శాఖకు చెందిన పెట్రోల్ బంక్లో ఫ్రాడ్ జరగడం చర్చనీయాంశంగా మారింది.
డీజిల్ కొడుతున్న సమయంలో గన్ నుంచి డీజిల్ కు బదులు గాలి రావడం.. రీడింగ్ మారడంతో అనుమానం వచ్చిన యువకులు బంక్ యజమాన్యాన్ని ప్రశ్నించారు. మిషన్ సాయంత్రం నుంచి ప్రాబ్లమ్ లో ఉంది కంప్లైంట్ రేస్ చేశామంటూ నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారు నిర్వాహకులు. అధికారుల ముందు ఐదు లీటర్ల డీజిల్ చెక్ చేస్తే నాలుగు లీటర్ల డీజిల్ మాత్రమే రావడంతో ఫైర్ అయ్యారు యువకులు . ప్రభుత్వ ఆధ్వర్యంలోనే నడిచే బంక్లో నే ఇలాంటి మోసాలు జరుగుతుంటే..ఇంక ప్రైవేట్ బంకుల్లో పరిస్థితి ఎలా ఉంటుందో అని వినియోగదారులు అభిప్రాయపడుతున్నారు.
సిబ్బంది పై కాకుండా పెట్రోల్ బంకు నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు వాహనదారులు. యాజమాన్యాలు తెలివిగా సిబ్బందిపై నింద మోపి తప్పించుకొని ప్రజల జేబుకు చిల్లు పెడుతున్నారని చెబుతున్నారు
