బషీర్ బాగ్, వెలుగు: ఐ ఫోన్లు కొనుగోలు చేసి డబ్బులు చెల్లించకుండా మోసాలకు పాల్పడుతున్న వ్యక్తిని అబిడ్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి 64 లక్షల 55 వేల రూపాయలు విలువ చేసే 102 ఐ ఫోన్ లు సీజ్ చేశారు. అబిడ్స్ పోలీస్ స్టేషన్ సీఐ నర్సింహా రాజు, ఏసీపీ చంద్రశేఖర్, సీపీ శరద్ చంద్ర పవర్ తెలిపిన వివరాల ప్రకారం... అబిడ్స్ జగదీశ్ మార్కెట్లో మొబైల్ షాప్ నడుపుతున్న అబ్దుల్లా విరానికి గత ఏడాది నవంబర్ 29న మహారాష్ట్ర ముంబై , గుజరాత్ సూరత్లకు చెందిన విజయ్ ఎంటర్ ప్రైజేస్ పేరిట వాట్సాప్లో విజయ్ కుమార్, నిరావ్ రాజ్ లు హోల్ సేల్ గా ఐ ఫోన్లు కావాలని కోరారు. నగదు బ్యాంక్ అకౌంట్కు ట్రాన్స్ఫర్ చేస్తామని నమ్మించారు.
వారి మాటలు నమ్మిన అబ్దుల్లా విరాని 64 లక్షల 55 వేలు విలువ చేసే 107 ఐఫోన్లను వారు చెప్పిన అడ్రస్కు కొరియర్ ద్వారా పంపించాడు. మొబైల్ ఫోన్ లు రిసీవ్ చేసుకున్న విజయ్, నిరావ్ రాజ్లు డబ్బులు చెల్లించకుండా మోసానికి పాల్పడ్డారని అబ్దుల్లా అబిడ్స్ పోలీసులకు డిసెంబర్ 8న ఫిర్యాదు చేశాడు. ఏ2నిరావ్ రాజ్ను గత నెల 30న సూరత్లో అదుపులోకి తీసుకుని అతని నుంచి 102 ఐ ఫోన్ లను సీజ్ చేసి కోర్టులో హాజరుపరిచారు. మరో నిందితుడు ఏ1 విజయ్ కుమార్ పరారీలో ఉన్నాడని త్వరలోనే పట్టుకుంటామని డీసీపీ తెలిపారు.