ఆపదలో ఉన్న వారికి ఉచిత ఆటో సేవలు

ఆపదలో ఉన్న వారికి ఉచిత ఆటో సేవలు

గండీడ్, వెలుగు: మండలంలోని రుసుంపల్లి గ్రామానికి చెందిన చిట్యాల యాదగిరి తన గ్రామస్తుల కోసం ఉచిత ఆటో సేవలను సోమవారం ప్రారంభించారు. హైదరాబాద్ లో ఫోటోగ్రాఫర్ గా పని చేస్తున్న యాదగిరి తన సొంత ఊరి ప్రజలకు అండగా నిలవాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా అత్యవసర పరిస్థితుల్లో గ్రామానికి అంబులెన్స్​ వచ్చే దాక ఆగకుండా ఆపదలో ఉన్న వారిని ఆసుపత్రికి తరలించేందుకు 10 మంది ఆటో ఓనర్లతో ఒప్పందం చేసుకున్నారు. 

గ్రామంలో ఎవరికైనా అత్యవసర వైద్యం అవసరమైతే ఆసుపత్రికి ఆటోలో తీసుకెళ్తారు. ఆటోకు అయ్యే ఖర్చు మొత్తాన్ని యాదగిరి భరిస్తారు. సోమవారం ఆటో సర్వీసులను మహమ్మదాబాద్  మండల కాంగ్రెస్  అధ్యక్షుడు కేఎం నారాయణ, నరోత్తంరెడ్డి ప్రారంభించి గ్రామస్తులకు సేవ చేసేందుకు ముందుకు వచ్చిన యాదగిరిని అభినందించారు. ఎంపీపీ మాధవి, మాజీ ఎంపీపీ శాంతి, పీఎన్ సీఎస్  అధ్యక్షుడు రాఘవేందర్ గౌడ్, దోమ వెంకటేశ్, రాములు పాల్గొన్నారు.