
రాష్ట్రవ్యాప్తంగా బుధవారం నుంచి పేదలకు ఉచిత బియ్యం పంపిణీ చేయనున్నట్లుగా మంత్రి గంగుల కమలాకర్ వెల్లడించారు. సాప్ట్వేర్ మాడిఫికేషన్ వల్లే రేషన్ పంపిణీలో కొంత జాప్యం జరిగిందని తెలిపారు. కరోనా సంక్షోభంలో పేదలకు ఉచిత బియ్యంతో పాటు రెండునెలల పాటు 1500 రూపాయలను ఉచితంగా అదించినట్లుగా మంత్రి గుర్తుచేశారు. డిసెంబర్ వరకు కేంద్రం ఇచ్చిన ఐదు కిలోలకు అదనంగా రాష్ట్ర ప్రభుత్వం మరో ఐదు కిలోలు కలిపి మొత్తం పది కిలోలు ఉచితంగా ఇచ్చిందన్నారు. అయితేఈ జనవరి నుండి కేంద్ర నిర్ణయం ప్రకారం రేషన్ ఇవ్వడానికి సాప్ట్వేర్ మాడిఫికేషన్ చేయాల్సి వచ్చిందని గంగుల వెల్లడించారు.
కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో కేవలం 54 లక్షల 48 వేల కార్డులకు మాత్రమే 5 కిలోల చొప్పున రేషన్ అందిస్తుంటే .. పేదల కోసం నిరంతరం తపించే సీఎం కేసీఆర్ మరో 92 లక్షల మందికి సొంతంగా బియ్యం పంపిణీ చేస్తున్నారని మంత్రి గంగుల తెలిపారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ సిలిండర్ ధరలు పెంచిన కేంద్ర ప్రభుత్వం ఉచిత బియ్యంపై మాట్లాడటం హాస్యా స్పదమని గంగుల అన్నారు.