భయపెడుతున్న బ్లాక్ ఫంగస్.. రాష్ట్రంలో మరో కేసు నమోదు

భయపెడుతున్న బ్లాక్ ఫంగస్.. రాష్ట్రంలో మరో కేసు నమోదు

భద్రాద్రి కొత్తగూడెం: రాష్ట్రంలో బ్లాక్ ఫంగస్ కేసులు బయటపడుతున్నాయి. రీసెంట్ గా కామారెడ్డిలోని రామారెడ్డిలో బ్లాక్ ఫంగస్ తో ఒకరు చనిపోయారు. ఇప్పుడు మరో బ్లాక్ ఫంగస్ కేసు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో బయటపడింది. కొత్తగూడెం జిల్లా, పెనుబల్లి మండలంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో ఈ కేసు నమోదైంది. వివరాలు.. అన్నపురెడ్డిపల్లి మండలం, రాజాపురం గ్రామానికి చెందిన తూలగుంట్ల సులోచన (57) అనే మహిళకు ఈనెల 10న కరోనా పాజిటివ్ గా వచ్చింది. దీంతో ఆమెను ఖమ్మంలోని అభయ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్చారు. కరోనా నుంచి ఆమె కోలుకోవడంతో మూడు రోజుల క్రితం డిశ్చార్జ్ అయ్యి పెనుబల్లి మండలం, ఉప్పలచెలక గ్రామంలోని తన కుమారుడు వద్దకు తీసుకొచ్చారు. అయితే శనివారం సాయంత్రం నుంచి ఆమె కన్నుకు దురద, వాపు రావడం, కంటిచూపు మందగించడంతో సోమవారం ఉదయం పెనుబల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులకు చూపించగా బ్లాక్ ఫంగస్ లక్షణాలు ఉన్నట్లు గుర్తించారు. మెరుగైన చికిత్స కోసం జిల్లా ఆస్పత్రికి పంపనున్నట్లు వైద్యులు తెలిపారు.