- నియామక పత్రం అందజేసిన సీఎం
- గొత్తి కోయల చేతిలో చనిపోయిన శ్రీనివాస రావు
ఖమ్మం కార్పొరేషన్, వెలుగు: డ్యూటీ చేస్తూ గొత్తి కోయల చేతిలో చనిపోయిన ఎఫ్ఆర్ఓ చలమల శ్రీనివాసరావు భార్యకు రాష్ట్ర ప్రభుత్వం డిప్యూటీ తహసీల్దార్ఉద్యోగం ఇస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఎఫ్ఆర్ఓ శ్రీనివాస రావు కొన్ని నెలల కింద భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలం ఎర్రబొడు గొత్తికోయల గుంపు చేతిలో హత్యకు గురయ్యారు. ఆయనకు భార్య, ఇద్దరు చిన్న పిల్లలు ఉండడంతో కుటుంబాన్ని ఆదుకుంటామని సీఎం కేసీఆర్ అప్పట్లో హామీ ఇచ్చారు.
ఈ మేరకు శ్రీనివాస రావు భార్య బండి భాగ్యలక్ష్మిని కారుణ్య నియామకం కింద డిప్యూటీ తహసీల్దార్గా నియమిస్తూ సోమవారం ఆర్డర్స్ ఇచ్చారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సోమవారం హరితోత్సవం నిర్వహించగా, హైదరాబాద్లో జరిగిన కార్యక్రమంలో భాగ్యలక్ష్మికి సీఎం నియామక పత్రాన్ని అందించారు. దీనిపై మంత్రి పువ్వాడ అజయ్కుమార్ హర్షం వ్యక్తం చేశారు.