ఇకపై సినిమాలు పైరసీ చేస్తే మూడేళ్లు జైలు శిక్ష.. కేంద్రం కీలక ప్రకటన

ఇకపై సినిమాలు పైరసీ చేస్తే మూడేళ్లు జైలు శిక్ష.. కేంద్రం కీలక ప్రకటన

సినిమా పరిశ్రమలో పైరసి విషయం కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇటీవల లోక్ సభలో పాస్ అయిన సినిమాటోగ్రఫీ సవరణ బిల్ 2023ను ప్రస్తుతం జరుగుతున్న వర్షాకాల సమావేశాల్లో భాగంగా రాజ్యసభలో ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్ కాస్టింగ్ మినిస్టర్ అనురాగ్ ఠాకూర్ ప్రవేశపెట్టారు. 

ఈ బిల్ ను రాజ్యసభ కూడా పాస్ చేసింది. ఈ బిల్ లో అనేక అంశాలు ఉన్నప్పటికీ పైరసీ, సెన్సార్ అంశాలపై ప్రత్యేకమైన నిర్ణయాలు తీసుకున్నారు. తాజాగా సవరించిన బిల్ ప్రకారం.. ఇకపై సినిమాను పైరసీ చేసినా, సినిమాని థియేటర్స్ లో మొబైల్స్ తో గానీ, కెమరాతో గానీ రికార్డ్ చేస్తే వారికి మూడేళ్ళ జైలు శిక్షతో పాటు, ఆ సినిమా ప్రొడక్షన్ కోసం అయిన ఖర్చులో 5 శాతం జరిమానా కట్టాల్సి ఉంటుంది.ఇక  ఈ రూల్ ని చాలా కఠినతరంగా అమలు చేయనున్నామని మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు.

బిల్ ప్రవేశపెట్టే సమయంలో మినిస్టర్ అనురాగ్ ఠాకూర్ మాట్లాడుతూ.. ప్రస్తుతం ఇండియన్ సినిమాలకు ప్రపంచవ్యాప్తంగా రీచ్ వచ్చింది. కానీ పైరసీ చేయడం వల్ల సంవత్సరానికి దాదాపు 20 వేల కోట్లు నష్టపోతున్నాం. అందుకే పైరసీని అరికట్టడానికి ఈ కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నాం. అలాగే ప్రస్తుతం సెన్సార్ ఇస్తున్న సర్టిఫికెట్స్ లో కూడా మార్పులు చేస్తున్నాం. ఇప్పటివరకు సెన్సార్ నుండి క్లీన్ U, U/A, A సర్టిఫికెట్స్ మాత్రమే ఇస్తుండగా.. తాజాగా U/A, S లో మరో మూడు సర్టిఫికెట్లు తీసుకొస్తున్నాం. అవి UA 7+, UA 13+, UA 16+ సర్టిఫికెట్స్. లిస్టులో తెలిపిన వయసులో ఉన్నవాళ్లు పేరెంట్స్ పర్యవేక్షణలో మాత్రమే ఆ సినిమాలను చూడాల్సి ఉంటుంది.