
- ప్రైమరీ స్కూళ్లలో ఎస్జీటీలు, పీఎస్ హెచ్ఎంల ఇన్స్పెక్షన్స్
- యూపీఎస్, హైస్కూళ్లకు స్కూల్ అసిస్టెంట్లు
- సుమారు 2వేల మందికి ఈ బాధ్యతలు!
- ఉత్తర్వులు జారీచేసిన విద్యాశాఖ
- టీచర్లతో తనిఖీలపై ఉపాధ్యాయుల్లో భిన్నాభిప్రాయాలు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో సర్కారు స్కూళ్ల తనిఖీలకు మరో టీములు రానున్నాయి. జిల్లాలోని టీచర్లనే తనిఖీ అధికారులుగా నియమించనున్నారు. ప్రైమరీ స్కూళ్లలో ఎస్జీటీలు, పీజీహెచ్ఎంలు.. అప్పర్ ప్రైమరీ, హైస్కూళ్లలో స్కూల్ అసిస్టెంట్లు ఇన్స్ పెక్షన్లు చేయనున్నారు. దీనికి సంబంధించిన ఉత్తర్వులను స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నవీన్ నికోలస్ రిలీజ్ చేశారు.
అయితే, వీటిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రంలో 629 మండలాల్లోని 1,817 క్లస్టర్ల పరిధిలోని 24,146 సర్కారు స్కూళ్లు ఉన్నాయి. వీటిలో ఎడ్యుకేషన్ క్వాలిటీ పెంచేందుకు గానూ తనిఖీలు చేయాలని సర్కారు డిసైడ్ అయింది. దీనికోసం ప్రతి జిల్లాలో 2శాతం మంది సీనియర్ టీచర్లను తనిఖీలు, పర్యవేక్షణ కోసం ప్రత్యేకంగా నియమించనున్నారు. ఈ లెక్కన సుమారు 2వేల మందిని తనిఖీ అధికారులుగా రిక్రూట్ చేయబోతున్నారు. జిల్లా కలెక్టర్ల సమక్షంలో వీరి ఎంపిక ఉండనున్నది.
ప్రతి ఏటా వీరిని నియమిస్తారు. అయితే, ఎక్కువ మంది స్టూడెంట్లున్న స్కూళ్ల నుంచి టీచర్లను నియమిస్తే విద్యార్థులకు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉండటంతో, కేవలం తక్కువ స్టూడెంట్లున్న స్కూళ్ల నుంచి మాత్రమే వీరిని ఎంపిక చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
ప్రైమరీ స్కూళ్ల తనిఖీ అధికారుల పోస్టులకు కనీసం పదేండ్ల అనుభవం ఉన్న పీఎస్ హెచ్ఎం లేదా ఎస్జీటీలు అర్హులు కాగా, హైస్కూళ్లు, యూపీఎస్ లకు మాత్రం పదేండ్ల సీనియార్టీ ఉన్న స్కూల్ అసిస్టెంట్లు అర్హులని ప్రకటించారు.
ప్రైమరీ/అప్పర్ ప్రైమరీ స్కూళ్ల తనిఖీ అధికారి రోజుకు రెండు స్కూళ్లు పరిశీలించాలి. మూడు నెలల్లో కనీసం వంద స్కూళ్లు కవర్ చేయాలి. హైస్కూల్ తనిఖీ అధికారి రోజుకు ఒక హైస్కూల్ను తనిఖీ చేయాలి. మూడు నెలల్లో సగటున 50 స్కూళ్లు కవర్ చేయాల్సి ఉంటుంది. తనిఖీల నివేదికను ప్రతినెలా ఐదులోపు ఉన్నతాధికారులకు సమర్పించాలి.
తనిఖీల సమయంలో అకడమిక్ అంశాలతో పాటు లైబ్రరీ, ల్యాబ్స్, స్టూడెంట్ల అటెండెన్స్, మిడ్డేమిల్స్ స్కీమ్, శానిటైజేసన్, హెల్త్ చెకప్ లు, మంచినీటి సౌకర్యం, టీచర్ల పనితీరు, ఇతర సౌకర్యాలను పరిశీలించాలి.
టీచర్ల మాట హెచ్ఎంలు వింటరా?
తనిఖీ టీముల్లో హెడ్మాస్టర్లను చేర్చలేదు. దీంతో స్కూల్ అసిస్టెంట్ ఆఫీసర్ గా ఉంటే.. హెడ్మాస్టర్లు వారికి తనిఖీ సమయంలో సహకరిస్తారా అనే అనుమానాలు ఉన్నాయి. మరోపక్క ఇప్పటికే స్కూళ్ల తనిఖీలకు మండల స్థాయిలో ప్రతి మండలానికి ఒక ఎంఈఓ ఉన్నారు. దీంతో పాటు క్లస్టర్ స్కూల్ హెచ్ఎంలు, సీఆర్పీలు ఉన్నారు. జిల్లా స్థాయిలో డీఈఓలు, డిప్యూటీఈఓలు, సమగ్ర శిక్ష పరిధిలో నలుగురైదుగురు జిల్లా కోఆర్డినేటర్లూ ఉన్నారు.
దీనికితోడు తాజాగా ఎంఈఓ, డీఈఓలతో పాటు ఆర్ జేడీలు, అడిషనల్ డైరెక్టర్లు, డైరెక్టర్ అందరూ తనిఖీలు చేయాలని ఇటీవలే ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే తనిఖీలకు అధికారులు ఉండగా, టీచర్లతో కూడా తనిఖీలు చేయించడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. పైనున్న వారంతా ఏం చేయాలనే ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి.