
- 17 సీట్లలో పోటీకి 306 దరఖాస్తులు
- ముగిసిన అప్లికేషన్ల ప్రక్రియ
- ఖమ్మం టికెట్ కోసం భట్టి విక్రమార్క భార్య నందిని దరఖాస్తు
- పెద్దపల్లిలో పోటీకి వివేక్ వెంకటస్వామి కుమారుడు గడ్డం వంశీకృష్ణ అప్లై
- వరంగల్ టికెట్ కోసంమోత్కుపల్లి నర్సింహులు..
- నల్గొండలో పోటీకి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి కూతురు శ్రీనిధి దరఖాస్తు
హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్ పార్టీ ఎంపీ టికెట్ల కోసం 306 దరఖాస్తులు వచ్చాయి. రాష్ట్రంలోని 17 లోక్సభ స్థానాలకు గాను బుధవారం నుంచి అప్లికేషన్ల స్వీకరణ ప్రారంభించగా.. శనివారం సాయంత్రం 5 గంటలకు ముగిసింది. తొలి రోజు ఏడు అప్లికేషన్లు రాగా.. రెండో రోజు 34, మూడో రోజు వంద, చివరి రోజైన నాలుగో రోజు 165 దరఖాస్తులు వచ్చాయి. అప్లికేషన్లు సమర్పించినవారిలో సీనియర్లు, యువ నేతలూ ఉన్నారు. శనివారం ఖమ్మం టికెట్ కోసం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భార్య మల్లు నందిని, కుసుమ కుమార్.. పెద్దపల్లి టికెట్ కోసం చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి కుమారుడు గడ్డం వంశీ కృష్ణ.. వరంగల్ టికెట్ కోసం మోత్కుపల్లి నర్సింహులు దరఖాస్తులు ఇచ్చారు. అదే విధంగా సికింద్రాబాద్ టికెట్ కోసం సామా రామ్మోహన్రెడ్డి, అంజన్కుమార్ యాదవ్ కుమారుడు అనిల్ కుమార్, కోదండరెడ్డి.. కరీంనగర్ టికెట్ కోసం రమ్యారావు.. నల్గొండ టికెట్ కోసం పటేల్ రమేశ్రెడ్డి.. మహబూబాబాద్ టికెట్ కోసం బెల్లయ్య నాయక్, బలరాం నాయక్.. భువనగిరి టికెట్ కోసం కొమ్మూరి ప్రతాప్ రెడ్డి, బండి సుధాకర్ గౌడ్ తదితరులు అప్లై చేసుకున్నారు. చివరి రోజు కావడం..పైగా ప్రముఖులంతా అప్లికేషన్లు ఇచ్చేందుకు రావడంతో శనివారం గాంధీభవన్ సందడి మారింది. భట్టి విక్రమార్క భార్య నందిని ఖమ్మం నుంచి 200 కార్ల కాన్వాయ్తో హైదరాబాద్కు వచ్చారు.
హాట్ సీటుగా ఖమ్మం
ఖమ్మం లోక్సభ స్థానం హాట్ సీటుగా మారింది. ఎక్కువ మంది సీనియర్లు అక్కడి నుంచి పోటీకి ఆసక్తి చూపిస్తున్నారు. వాస్తవానికి ఆ స్థానం నుంచి సోనియాగాంధీని బరిలోకి దింపాలని కాంగ్రెస్ పెద్దలు భావిస్తున్నారు. తెలంగాణ నుంచి సోనియాను పోటీ చేయించేందుకు ఇప్పటికే పార్టీ రాష్ట్ర నేతలు తీర్మానం కూడా చేశారు. అయితే.. ఆ స్థానం నుంచి పోటీ కోసం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భార్య నందిని దరఖాస్తు చేసుకున్నారు. అలాగే సీనియర్ నేతలు రేణుకా చౌదరి, వీహెచ్ కూడా అప్లై చేసుకున్నారు. ఇటు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తమ్ముడు ప్రసాద్ రెడ్డి, మరో మంత్రి తుమ్మల నాగేశ్వర రావు కుమారుడు యుగేందర్ కూడా ఖమ్మం టికెట్కోసం ప్రయత్నాలు చేస్తున్నట్టు పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తున్నది. మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు, వీవీసీ గ్రూప్స్ అధినేత రాజేంద్ర ప్రసాద్ కూడా ఆ స్థానం నుంచి పోటీకి దరఖాస్తు పెట్టుకున్నారు. సీనియర్ నేత కుసుమ కుమార్ కూడా అప్లై చేసుకున్నారు. సోనియా గాంధీ పోటీ చేయకుంటే ఆ స్థానం నుంచి టికెట్ ఎవరికిస్తారనే చర్చ సాగుతున్నది. ఒకవేళ సోనియాగాంధీ పోటీ చేస్తానంటే ఆమె గెలుపు కోసం పార్టీ నేతలందరం కలిసికట్టుగా పనిచేస్తామని భట్టి విక్రమార్క భార్య నందిని చెప్పారు.
ఉమ్మడి నల్గొండలోని రెండు సీట్లకూ భారీగానే!
ఉమ్మడి నల్గొండ జిల్లాలోని 2 ఎంపీ స్థానాల్లో కాంగ్రె స్ తరఫున పోటీ చేసేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపుతున్నారు. ఇందులో నల్గొండ టికెట్ కోసం సీనియర్ నేత జానారెడ్డి కుమారుడు రఘువీర్రెడ్డి అప్లై చేసుకున్నారు. పటేల్ రమేశ్రెడ్డి కూడా ఇదే స్థా నం నుంచి పోటీకి దరఖాస్తు చేసుకున్నారు. మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి కూతురు శ్రీనిధిరెడ్డి కూడా నల్గొండ టికెట్ కోసం దరఖాస్తు సమర్పించారు. ఇటు భువనగిరి నుంచి పలువురు సీనియర్ నేతలతో పాటు యువ నేతలూ పోటీ పడుతున్నారు. మంత్రి వెంకట్ రెడ్డి అన్న మోహన్ రెడ్డి కుమారుడు సూర్య పవన్ రెడ్డి, మరో బంధువు చల్లూరి మురళీధర్ రెడ్డి దరఖాస్తు చేసుకున్నారు. ఇదే టికెట్ కోసం చామల కిరణ్ కుమార్రెడ్డి, తీన్మార్ మల్లన్న కూడా అప్లికేషన్ పెట్టుకున్నారు. భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ రెడ్డి కూతురు కీర్తి రెడ్డి కూడా దరఖాస్తు చేశారు.
మల్కాజిగిరి, మరికొన్ని చోట్ల ఇట్ల..!
సీఎం రేవంత్ రెడ్డి మొన్నటిదాకా ప్రాతినిధ్యం వహిం చిన మల్కాజిగిరి సెగ్మెంట్కూడా హాట్సీటుగానే కనిపిస్తున్నది. అక్కడి నుంచి పోటీకి బండ్ల గణేశ్, కపిలవాయి దిలీప్కుమార్అప్లై చేసుకున్నారు. మహబూబాబాద్ టికెట్ కోసం కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్తో పాటు ఆదివాసీ కాంగ్రెస్ రాష్ట్ర చైర్మన్ బెల్లయ్య నాయక్, తెలుగు యూనివర్సిటీ రిజిస్ట్రార్ భట్టు రమేశ్ దరఖా స్తు పెట్టుకున్నారు. నాగర్కర్నూల్ టికెట్ కోసం ఏఐ సీసీ సెక్రటరీ సంపత్ కుమార్, ఢిల్లీలో ప్రభుత్వ ప్రత్యే క ప్రతినిధి మల్లు రవి, చారగొండ వెంకటేశ్ అప్లై చేశారు. మెదక్ నుంచి సోమేశ్వర్ రెడ్డి, జగ్గారెడ్డి అప్లై చేసుకున్నారు.
సోనియా, ప్రియాంక పోటీ చేయకుంటే.. నాకు టికెట్ ఇవ్వండి: మల్లు నందిని
ఖమ్మం నుంచి సోనియా లేదా ప్రియాంక గాంధీ పోటీ చేస్తే వారికి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తామని డిప్యూటీ సీఎం భట్టి భార్య నందిని అన్నారు. వారు పోటీ చేయకుంటే ఖమ్మం టికెట్ తనకు ఇవ్వాలని అధిష్ఠానాన్ని ఆమె కోరారు.శనివారం ఖమ్మం ఎంపీ టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్న తర్వాత ఆమె మీడియాతో మాట్లాడారు. తనకు అవకాశం ఇస్తే భారీ మెజారిటీతో గెలుస్తానని, అధిష్ఠానం ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటానని తెలిపారు. రాష్ట్రంలోని అన్ని సీట్లల్లో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని, రాహుల్ ప్రధాని కావడం ఖాయమని చెప్పారు.
కాకా వారసత్వం ఓ బాధ్యత: గడ్డం వంశీ కృష్ణ
కాకా వెంకటస్వామి వారసత్వం తనకు ఓ బాధ్యత అని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి కుమారుడు గడ్డం వంశీకృష్ణ అన్నారు. పెద్దపల్లి ఎంపీ టికెట్ కోసం శనివారం గాంధీభవన్లో ఆయన దరఖాస్తు చేసుకున్నారు. తొలుత తన తాత కాకా వెంకటస్వామి విగ్రహానికి నివాళులర్పించి ఆశీస్సులు తీసుకున్నారు. దరఖాస్తు సమర్పించేందుకు ఆయన వెంట పెద్ద సంఖ్యలో అనుచరులు వచ్చారు. అప్లికేషన్ అనంతరం బయటకు వస్తూ మీడియాతో మాట్లాడారు. ‘‘తెలంగాణ వచ్చాకే కన్నుమూస్తానని చెప్పిన గొప్ప పోరాటయోధుడు కాకా వెంకటస్వామి. బ్రిటీషర్ల పాలన సమయం నుంచి స్వాతంత్ర్య పోరాటాన్ని ప్రత్యక్షంగా చూసిన వ్యక్తి కాకా వెంకటస్వామి. తెలంగాణ ఉద్యమంలోనూ చెరగని ముద్ర వేసుకున్నారు. 1969 తెలంగాణ ఉద్యమంలో బుల్లెట్ గాయాలూ తిన్నారు. మలిదశ ఉద్యమంలోనూ పోరాడారు. కాకా వెంకటస్వామి మనుమడిగా పుట్టడం నాకు సంతోషమేకాకుండా.. అదో బాధ్యత” అని గడ్డం వంశీకృష్ణ అన్నారు. తన తండ్రి వివేక్ వెంకటస్వామి తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేశారని ఆయన చెప్పారు.