- స్వగృహ ఇండ్లకు మస్తు డిమాండ్
- 5 రోజుల్లో 7,500 అప్లికేషన్లు
- కొందరు 5 నుంచి 10 దరఖాస్తులు వేస్తున్నరు
- జూన్ 14 దాకా గడువు..22న లాటరీ ద్వారా కేటాయింపు
- లక్ష అప్లికేషన్లు వచ్చే అవకాశం ఉందంటున్న అధికారులు
- రూ.50 లక్షల్లోపే డీలక్స్ ట్రిపుల్ బెడ్రూం ఫ్లాట్
- ధర తక్కువ ఉండటంతో కొనేందుకు జనం ఆసక్తి
హైదరాబాద్, వెలుగు: రాజీవ్ స్వగృహ ఇండ్లకు అనూహ్య స్పందన వస్తోంది. తక్కువ ధరకే ఫ్లాట్లు అందుబాటులో ఉండటంతో డిమాండ్ ఎక్కువగా ఉంటోంది. 5 రోజుల్లో 7,500 అప్లికేషన్లు వచ్చినట్లు అధికారులు తెలిపారు. బండ్లగూడ, పోచారంలో 2,971 సింగిల్, డబుల్, ట్రిపుల్, ట్రిపుల్ డీలక్స్ ఫ్లాట్లకు హౌసింగ్ డిపార్ట్మెంట్ ఈనెల 12 నోటిఫికేషన్ విడుదల చేసింది. జూన్ 14 సాయంత్రం దాకా దరఖాస్తు చేసుకునేందుకు గడువు విధించింది. ప్రజలతోపాటు సర్కారు ఉద్యోగులు కూడా అప్లై చేసుకునేందుకు అవకాశం కల్పించింది. ఈ నెల రోజుల్లో సుమారు లక్ష అప్లికేషన్లు వస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు. కంప్యూటర్ లాటరీ ద్వారా జూన్ 22న ఫ్లాట్లను కేటాయించనున్నారు.
రూ.50 లక్షల్లోపే డీలక్స్ ట్రిపుల్ బెడ్రూం ఫ్లాట్
బండ్లగూడలో 1,501, పోచారంలో 1,470 ఫ్లాట్స్ అమ్మకానికి పెట్టారు. బండ్లగూడలో ఒక్క స్క్వేర్ ఫీట్ (రెడీ టు ఆక్యుపై) రూ.3 వేలు, సెమిఫినిష్డ్ రూ.2,750గా ఖరారు చేశారు. పోచారంలో కంప్లీట్ అయిన వాటికి రూ.2,500, సెమిఫినిష్డ్ కు రూ.2,250 రేట్ ఖరారు చేశారు. బండ్లగూడలో ట్రిపుల్ బెడ్ రూమ్ డీలక్స్ ఫ్లాట్ రూ.48,15,000కి అందుబాటులో ఉంది. ఇదే ప్రాంతంలో బయట ఫ్లాట్ కొనాలంటే రూ.75 లక్షలపైనే ఉంది. ఒక్కో అప్లికేషన్కు రూ.1,000 నాన్ రిఫండబుల్ ఫీజును సర్కారు ఖరారు చేసింది. దీంతో ఫ్లాట్ కొనుగోలు చేయాలనుకునే వాళ్లు ఎక్కువ అప్లికేషన్లు వేస్తున్నరు. భార్య, తల్లిదండ్రులు, ఫ్రెండ్స్ పేరుతో ఒక్కొక్కరు 5 నుంచి 10 దరఖాస్తులు వేస్తున్నరు. పోతే రూ.10 వేలు పోతయి, వస్తే ఫ్లాట్ వస్తదని ఎక్కువ ఇలా దరఖాస్తులు పెట్టుకుంటున్నారు. ఒక వ్యక్తి పేరుతో, ఆధార్తో ఒకే అప్లికేషన్ ఇచ్చే అవకాశం ఉండటంతో ఇలా చేస్తున్నరని అధికారులు అంటున్నరు. ఇప్పటిదాకా అప్లికేషన్ల రూపంలోనే రూ.75 లక్షల ఆదాయం సర్కారుకు వచ్చింది.
90 శాతం లోన్ ఆఫర్ చేస్తున్న బ్యాంకులు
బండ్లగూడలో హౌసింగ్ డిపార్ట్మెంట్ ప్రత్యేక స్టాళ్లను ఏర్పాటు చేసింది. దరఖాస్తు చేసుకునేందుకు ఉదయం 10 నుంచి రాత్రి 8 గంటల వరకు టైమ్ ఇచ్చింది. అప్లికేషన్తోపాటు ఫీజు, ఆధార్ వివరాలు తీసుకుంటున్నరు. ఇక్కడే ఉంటున్న ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకుల సిబ్బంది.. కొనుగోలుదారుని శాలరీ, ఇతర అర్హతలకు అనుగుణంగా ఫ్లాట్ వ్యాల్యూలో 90 శాతం లోన్ ఇస్తామని చెబుతున్నారు.
రూ.800 కోట్ల ఆదాయ అంచనా
ప్రభుత్వం వేలానికి పెట్టిన ఇండ్లు 2,900 మాత్రమే ఉన్నాయి. నాలుగు రోజులకే 7,500 అప్లికేషన్లు వచ్చాయంటే జూన్ 14 వరకు మొత్తం లక్ష అప్లికేషన్లు వస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ఫ్లాట్ల అమ్మకం ద్వారా సుమారు రూ.800 కోట్ల ఆదాయం వస్తుందని చెబుతున్నారు. “ఇండ్ల వేలానికి అనూహ్య స్పందన వస్తోంది. లక్ష అప్లికేషన్లు రావొచ్చని అనుకుంటున్నం. వీటి వల్ల ఇతర జిల్లాల్లో ఫ్లాట్స్, జాగాలు తొందరగా అమ్ముడుపోయే అవకాశం ఉంది” అని హౌసింగ్ డిపార్ట్మెంట్కు చెందిన ఓ ఆఫీసర్ తెలిపారు.
ధరలు తక్కువ ఉండటంతో అప్లై చేసిన
10 ఏళ్లుగా హైదరాబాద్లో ఫార్మా కంపెనీలో జాబ్ చేస్తున్న. అపార్ట్మెంట్లో ఫ్లాట్ కొనాలని చాన్నాళ్లుగా ప్రయత్నిస్తున్న. ధరలు చాలా ఎక్కువగా ఉన్నాయి. కానీ రాజీవ్ స్వగృహలో రూ.40 లక్షలకే ట్రిపుల్ బెడ్రూం ఫ్లాట్ దొరుకుతుంది. అందుకే అప్లై చేసిన. ఫ్లాట్ అలాట్మెంట్ కంప్యూటర్ లాటరీ ద్వారా ఉంటుందని నిర్వహకులు తెలిపారు. దీంతో మా ఫ్యామిలీలో ఐదుగురి పేరుతో 5 అప్లికేషన్లు పెట్టిన.
- విక్రమ్, రామంతాపూర్
కొన్నే ఉన్నయ్
కొంత కాలంగా ఫ్లాట్ కొనాలని చూస్తున్న. ధరలు రూ.60 లక్షలకు తక్కువ ఎక్కడా దొరకటం లేదు. రాజీవ్ స్వగృహ ధరలు కొనుగోలుదారులకు అందుబాటులో ఉన్నయి. ప్రభుత్వం మంచి అవకాశం కల్పించింది. మొత్తం 10 అప్లికేషన్లు పెట్టిన. ఒక్క అప్లికేషన్కు అయినా అదృష్టం వరిస్తుందని అనుకుంటున్న.
- రవీందర్ రెడ్డి, ఉప్పల్
