ఏపీ బోర్డర్లోని మన వైన్ షాప్లకు మస్తు డిమాండ్
ఆ రాష్ట్రంలో మందు అమ్మకాలు బ్యాన్ అంటూ వార్తలు
ఏపీ లోకల్ బాడీ ఎన్నికలతో బోర్డర్లో సేల్స్ పెరిగే చాన్స్
అమ్మకాలు రూ. 500 కోట్లు పెరుగుతాయని లెక్కలు
హైదరాబాద్, వెలుగు: ఆంధ్రప్రదేశ్లో మందు బంద్ చేయనున్నట్టు వార్తలు వస్తుండటంతో సరిహద్దునున్న మన రాష్ట్రంలోని వ్యాపారులు, అధికారులు మస్తు ఖుషీ అయితున్నరు. త్వరలో అక్కడ ఎన్నికలు జరగనుండటం, ఎలక్షన్స్ అయ్యే వరకు 18 రోజులు మందు అమ్మకాలు ఆపేస్తారని అంటుండటంతో మస్తు ఆదాయమొస్తుందని సంతోషపడుతున్నరు. సేల్స్ ఎక్కువుంటయని ఏపీ సరిహద్దులో ఉన్న షాపులకు మన అధికారులూ మందు బాగానే సప్లై చేస్తున్నరు.
12 నుంచి 29 దాకా
ఏపీలో పంచాయతీ, జిల్లా పరిషత్, మున్సిపల్ ఎన్నికల షెడ్యూలు విడుదలైంది. ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు మద్యం అమ్మకాలపై అక్కడి సర్కారు నిషేధం విధించనుందని తెలిసింది. ఈ నెల 12 నుంచి 29 వరకు లిక్కర్ అమ్మకాలను నిలిపివేయనున్నట్టు సమాచారం. ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. దీంతో మన రాష్ట్రంలో అమ్మకాలు పెరిగి, ఎక్సైజ్ ఆదాయం పెరిగే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు. అందుకే సరిహద్దు జిల్లాలకు కావాల్సినంత లిక్కర్ సరఫరా చేసేందుకు రెడీ అవుతున్నారు. ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాలోని వైన్ షాపులకు ప్రతి నెలా కేటాయించే కోటాకు రెండింతలు ఎక్కువగా లిక్కర్ అందించనున్నట్టు తెలిసింది.
538 షాపులకు డబుల్ సప్లై
ఏపీ బార్డర్కు దగ్గరున్న 538 లిక్కర్ షాపులకు ఈ నెల రెట్టింపు మందును ఎక్సైజ్ అధికారులు సప్లై చేయనున్నట్టు తెలిసింది. 8 కొత్త జిల్లాలు ఏపీకి సరిహద్దులుగా ఉన్నాయి. ప్రతి నెల ఈ జిల్లాల నుంచి దాదాపు రూ. 500 కోట్ల మందు అమ్మకాలుంటాయి. ఏపీలో జరిగే ఎన్నికల దృష్ట్యా ఆదాయం రూ. వెయ్యి కోట్లు దాటొచ్చని అంచనా వేస్తున్నారు. ఏపీలో ఎన్నికల పక్రియ పూర్తయ్యే వరకు లిక్కర్ పంపిణీలో ఇబ్బంది లేకుండా స్పెషల్ టీమ్లు ఏర్పాటు చేసినట్టు తెలిసింది.
అక్కడ మందు ధరలెక్కువ
రాష్ట్రంతో పోలిస్తే ఏపీలో మందు ధరలు ఎక్కువ. అక్కడా, ఇక్కడా ఫుల్ బాటిల్కు కనీసం రూ.100 తేడా ఉంది. 180 ఎంఎల్కు రూ. 15 నుంచి రూ. 30 వరకు గ్యాప్ ఉంది. దీంతో ఇప్పటికే ఎక్కువ మంది ఇటు వైపు వచ్చి మందును కొంటున్నట్టు తెలిసింది. ఎలక్షన్ టైంలో ఆ రాష్ట్రం మందును కట్టడి చేయనుండటంతో సరిహద్దుల్లో లిక్కర్ సేల్స్ మరింత పెరగొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.
For More News..