
బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం గోషామహల్ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి టికెట్ తనకు కేటాయిస్తే.. ఎన్నికల్లో గెలిచి సీఎం కేసీఆర్ కు బంగారు పళ్లెంలో గెలుపు పత్రంతో కానుకను అందిస్తానని బీఆర్ఎస్ నాయకులు గడ్డం శ్రీనివాస్ యాదవ్ అన్నారు.
ఐదు నియోజకవర్గాల ఎమ్మెల్యే అభ్యర్థుల టికెట్లను అదిష్టానం పెండింగ్ లో పెట్టిన విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే... అయినప్పటికీ, కొందరు బీఆర్ఎస్ నేతలు టికెట్టు తమకే ఖరారు అయ్యిందని చెప్పుకుంటున్నారని గడ్డం శ్రీనివాస్ యాదవ్ చెప్పారు. దీంతో నియోజకవర్గంలో టికెట్టు ఎవరికి వస్తుందోనని ప్రజలు, బీఆర్ఎస్ నాయకులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని తెలిపారు.
అయితే అక్టోబర్ 6వ తేదీన నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో 10 వేల మందితో ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేస్తామని ఆయన చెప్పారు. ఈ ఆత్మీయ సమ్మేళనానికి ప్రధాన కారణం తాను ఏడాది కాలంగా దళితవాడలో బసయాత్ర, నిరుద్యోగులకు జాబ్ మేళా, ఉచిత విద్య, ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన వారికి అందించే విధంగా చేస్తున్న కృషి సందర్భంగా సమ్మేళనాన్ని నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు.
గోషామహల్ బీఆర్ఎస్ టికెట్టు తనకు కేటాయిస్తే గెలిచి రూ.11 లక్షలు విలువ చేసే బంగారు పళ్లెంలో కేసీఆర్ కు కానుకగా అందిస్తానని.. అందుకోసం ఈ పళ్లెంను ముందుగా తయారు చేయించి మీడియాకు చూపిస్తున్నానని గడ్డం శ్రీనివాస్ యాదవ్ తెలిపారు.