సీడ్ కంపెనీలు, ఆర్గనైజర్ల మోసాలు అరికట్టాలి .. గద్వాల, కర్నూల్​​ రోడ్డుపై రైతులు రాస్తారోకో

సీడ్  కంపెనీలు, ఆర్గనైజర్ల మోసాలు అరికట్టాలి .. గద్వాల, కర్నూల్​​ రోడ్డుపై రైతులు రాస్తారోకో
  • కలెక్టరేట్ ను ముట్టడించిన సీడ్ పత్తి రైతులు

గద్వాల, వెలుగు: సీడ్​ కంపెనీలు, ఆర్గనైజర్లు చేస్తున్న మోసాలు, దోపిడీని అరికట్టి తమను ఆదుకోవాలని డిమాండ్  చేస్తూ శనివారం నడిగడ్డ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో సీడ్  పత్తి రైతులు కలెక్టరేట్ ను ముట్టడించారు. కలెక్టరేట్  ముందు బైఠాయించి ప్రభుత్వం, ఆఫీసర్లు, సీడ్ కంపెనీలు, ఆర్గనైజర్లకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గద్వాల, కర్నూల్​ రహదారిపై రాస్తారోకో చేశారు. రైతుల ఆందోళనతో భారీగా వాహనాలు నిలిచిపోయాయి. ఈ సందర్భంగా నడిగడ్డ హక్కుల పోరాట సమితి అధ్యక్షుడు రంజిత్  మాట్లాడుతూ.. విత్తన పత్తి రైతులపై జరుగుతున్న దోపిడీని అరికట్టాలన్నారు. సీడ్  పత్తి ప్యాకెట్  రేట్లు పెంచకుండా, తగ్గిస్తూ రైతులను మోసం చేస్తున్నారని మండిపడ్డారు.

 ఫెయిల్  అయిన విత్తనాలను రీ శాంపిల్  చేపట్టాలని డిమాండ్ చేశారు. సీడ్ కంపెనీల ప్రయోజనాలను రైతులకు అందకుండా ఆర్గనైజర్లు దోపిడీ చేస్తున్నారని పేర్కొన్నారు. సీడ్  పత్తి రైతులకు న్యాయం చేయకపోతే కోర్టును 
ఆశ్రయిస్తామని హెచ్చరించారు.

పెట్రోల్  బాటిల్​ కలకలం..

రైతులు రాస్తారోకో చేస్తుండగా, ఓ రైతు బాటిల్ లో పెట్రోల్  తెచ్చుకొని తనపై పోసుకునేందుకు ప్రయత్నం చేయగా, అది పగిలిపోయి అక్కడున్న రైతులపై పడడంతో కలకలం రేగింది. పెట్రోల్  బాటిల్​తో వచ్చిన రైతును వెంటనే అక్కడి నుంచి పక్కకు తీసుకెళ్లారు. దీంతో ప్రమాదం తప్పింది. కలెక్టర్  బయటికి రావాలని రైతులు పట్టుపట్టగా, డీఎస్పీ మొగులయ్య రైతులకు నచ్చజెప్పడంతో శాంతించారు. అనంతరం అడిషనల్  కలెక్టర్  లక్ష్మీనారాయణకు వినతిపత్రం అందజేశారు.