
గద్వాల, వెలుగు: గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవి మధ్య విభేదాలు తలెత్తగా, ఢిల్లీలోని తెలంగాణ ప్రభుత్వ అధికార ప్రతినిధి జితేందర్ రెడ్డి రాజీ కుదిర్చారు. ఆవిర్భావ దినోత్సవానికి హాజరైన ఏపీ జితేందర్ రెడ్డి వేడుకలు ముగిసిన తరువాత ఎంపీ మల్లు రవిని వెంటబెట్టుకొని గద్వాల ఎమ్మెల్యే ఇంటికి వెళ్లారు. ఎమ్మెల్యేతో ఇచ్చిన తేనేటి విందులో పాల్గొన్నారు. ఏప్రిల్ నెలలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ధరూర్ లో భూభారతి రెవెన్యూ చట్టంపై అవగాహన సదస్సుకు వచ్చారు. గద్వాల నియోజకవర్గంలో పార్టీలోని రెండు గ్రూపుల మధ్య విభేదాలతో ఆ కార్యక్రమం రసాభాసగా మారింది.
మినిస్టర్ తిరిగి వెళ్తున్న సమయంలో ఆయన కారులో ఎంపీ, ఎమ్మెల్యే మధ్య మాటమాట పెరిగి విభేదాలు వచ్చాయి. ఈ వ్యవహారంపై అప్పట్లో సోషల్ మీడియాతో పాటు పత్రికల్లో వార్తలు వచ్చాయి. ఇద్దరి మధ్య విభేదాలు లేవని చెప్పేందుకు జితేందర్ రెడ్డి ఎంపీతో కలిసి ఎమ్మెల్యే ఇంటికి వెళ్లినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇదిలాఉంటే జితేందర్రెడ్డితో కలిసి ఎమ్మెల్యే ఇంటికి వెళ్లిన ఎంపీ మల్లు రవి ఆ తరువాత మాజీ జడ్పీ చైర్పర్సన్ సరిత ఇంటికి వెళ్లారు. ఆమెతో మంతనాలు జరిపి తిరిగి వెళ్లిపోయారు.
హైకమాండ్కు కంప్లైంట్ చేస్తాం..
అలంపూర్ ఎమ్మెల్యే విజయుడును వెంట పెట్టుకొని ఎంపీ మల్లు రవి తిరగడంపై ఎన్ఎస్ యూఐ జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్ అభ్యంతరం తెలిపారు. ఈ విషయంపై హైకమాండ్కు కంప్లైంట్ చేస్తామని చెప్పారు. టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ బాధ్యతలు అప్పగిస్తే, ఆయనే బీఆర్ఎస్ నాయకులను ప్రోత్సహిస్తూ తిరగడం ఏమిటని
ప్రశ్నించారు.