- పరారీలో మరో నలుగురు
- నిందితుల్లో ఒకరు పోలీస్ అధికారి
- ముగ్గురు నయీం అనుచరులు
హనుమకొండ, వెలుగు: నకిలీ తుపాకీతో బెదిరిస్తూ భూదందాలకు పాల్పడుతున్న గ్యాంగ్ను కేయూ పోలీసులు పట్టుకున్నారు. మొత్తం పది మంది గ్యాంగ్ లో ఆరుగురిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించగా.. ఇంకో నలుగురు పరారీలో ఉన్నారు. గ్యాంగ్ లో ముగ్గురు నయీం అనుచరులతో పాటు ఓ పోలీస్ అధికారి(ఆర్ఐ), మాజీ ఎంపీపీ ఉండటం చర్చనీయాంశమైంది. అరెస్టయిన వారి నుంచి డమ్మీ తుపాకీ, 2 తల్వార్లు, ఒక ఫార్చునర్కారు స్వాధీనం చేసుకున్నారు. హనుమకొండ కేయూ ఇన్స్పెక్టర్దయాకర్, ఎస్సై సంపత్ తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దపల్లి జిల్లాకు చెందిన ముద్దసాని వేణుగోపాల్ గతంలో గ్యాంగ్స్టర్నయీం వద్ద పని చేశాడు. నయీం ఎన్కౌంటర్ అనంతరం వరంగల్ నగరానికి వచ్చిన ఆయన గతంలో వరంగల్ కమిషనరేట్పరిధిలో, ప్రస్తుతం ఉమ్మడి కరీంనగర్జిల్లాలో రిజర్వ్ ఇన్స్పెక్టర్(ఆర్ఐ)గా పని చేస్తున్న సంపత్కుమార్, జయశంకర్ జిల్లాకు చెందిన మల్లన్న అనే మాజీ ఎంపీపీతో కలిసి భూ దందాలకు తెరలేపాడు. నయీం గ్యాంగ్ లో పని చేసిన హనుమకొండ సిద్ధాపూర్కు చెందిన మేకల రమేశ్, హసన్పర్తి మండలం పెంబర్తి గ్రామానికి చెందిన పంగ రవిని వారితో కలుపుకొన్నారు. వీరితో పాటు హసన్పర్తి మండలం మల్లారెడ్డిపల్లికి చెందిన కేతెపాక రమేశ్, భీమారానికి చెందిన బొజ్జ హరిబాబు, ప్రవీణ్, శాయంపేట మండలం కొప్పులకు చెందిన అలువాల నరేశ్తో కలిసి ముఠా ఏర్పాటు చేశారు. వీరంతా భూ సెటిల్మెంట్లు చేసేవారు. అవసరాన్ని బట్టి దాడులకూ తెగబడేవారు. ఇందుకు ఓ డమ్మీ తుపాకీతో పాటు 2 తల్వార్లు సమకూర్చుకున్నారు. ఇలా వరంగల్ కమిషనరేట్పరిధిలో పెద్దఎత్తున భూదందాలకు పాల్పడ్డారు. నయీం గ్యాంగ్, ఆర్ఐ ఆధ్వర్యంలో సాగుతున్న భూదందా గురించి కాకతీయ యూనివర్సిటీ పోలీసులకు సమాచారం అందింది. దీంతో కేయూ పోలీసులు కూపీ లాగారు.
పరారీలో ప్రధాన నిందితులు
భూ దందాలకు తెరలేపిన వేణుగోపాల్ హనుమకొండ యాదవ నగర్ లో ఉంటూ గోపాలపూర్, భీమారం సమీపంలో రియల్ ఎస్టేట్ఆఫీస్తెరిచాడు. అందులోనుంచే మిగతా ముఠా సభ్యులతో దందాకు సంబంధించిన కార్యకలాపాలు సాగించేవాడు. గ్యాంగ్ సభ్యులు వస్తున్నారనే సమాచారంతో జులై 29 రాత్రి 9.30 గంటల సమయంలో భీమారంలోని పలివేల్పుల క్రాస్ రోడ్డు సమీపంలో పోలీసులు వెహికిల్ చెకింగ్చేపట్టారు. ఏ1 నిందితుడైన ముద్దసాని వేణుగోపాల్కారును అలువాల నరేశ్నడుపుతూ వచ్చాడు. కారు ఆపి తనిఖీ చేయగా అందులో తల్వార్ దొరికింది. అతడిని పట్టుకుని విచారణ జరపగా ఇంట్లో మరో తల్వార్లభించింది. పోలీసులు ముఠా సభ్యుడైన బొజ్జ హరిబాబును పట్టుకుని అతడి నుంచి డమ్మీ తుపాకీ స్వాధీనం చేసుకున్నారు. అనంతరం గ్యాంగ్ సభ్యులైన కేతెపాక రమేశ్, మేకల రమేశ్, పంగ రవి, ప్రవీణ్ ను అదుపులోకి తీసుకున్నారు. ప్రధాన నిందితులైన ముద్దసాని వేణుగోపాల్, ఏ2 సంపత్ కుమార్(ఆర్ఐ), మాజీ ఎంపీపీ మల్లన్న, వేణుగోపాల్ డ్రైవర్ క్రాంతి పరారీలో ఉన్నారు. పట్టుకున్న ఆరుగురిని ఖమ్మం జిల్లా జైలుకు తరలించారు.