ఒకప్పుడు కల్లోల జిల్లాగా పేరున్న కరీంనగర్ జిల్లా నేడు శాంతిభద్రతల పరిరక్షణలో ముందుందన్నారు మంత్రి గంగుల కమలాకర్. శాంతి భద్రతల పరిరక్షణలో కరీంనగర్ పోలీసులకు దేశవ్యాప్తంగా ప్రత్యేకత ఉందన్నారు. తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది వేడుకల సందర్భంగా ఇవాళ పోలీసుల ఆధ్వర్యంలో కరీంనగర్ లో ర్యాలీ నిర్వహించారు.. ఈ సందర్బంగా మాట్లాడిన గంగుల కమలాకర్ కూంబింగ్ ఆపరేషన్ ప్రక్రియ కరీంనగర్ నుంచే ప్రారంభమయ్యిందన్నారు. కరీంనగర్ పోలీసులు శాంతిభద్రతల్లోనే కాదు సామాజిక సేవలో కూడా ముందున్నారని తెలిపారు. కరోనా కట్టడికి కరీంనగర్ పోలీస్ లు విశేష కృషి చేశారని చెప్పారు. లేక్ పోలీస్, డ్రంక్ అండ్ డ్రైవ్, నిరంతర వాహనాల తనిఖీలతో పోలీసులు ఎంతో మంది ప్రాణాలను కాపాడారని తెలిపారు.
హాస్పిటల్ లో చిన్నారిని ఎత్తుకెళ్లిన కేసును 3 గంటల్లో చేధించిన ఘనత కరీంనగర్ పోలీసులదన్నారు. పోలీసుల నిరంతర అప్రమత్తతో కరీంనగర్ లో దొంగతనాలు తగ్గాయని చెప్పారు. కరీంనగర్ లో దొంగతనం చేస్తే ఖచ్చితంగా దొరికి పోతారనే భయం దొంగల్లో ఉందన్నారు. పోలీస్ శాఖ వల్లే రాష్ట్రంలో ప్రజలు కంటి నిండా నిద్ర పోతున్నారని.. తెలంగాణ సాధనలో కూడా పోలీసుల పాత్ర ఎంతో ఉందన్నారు. హరితహారంలో కూడా కరీంనగర్ పోలీసుల పాత్ర కీలక మన్నారు.