ఒకరి అరెస్ట్.. 110 కిలోల సరుకు స్వాధీనం
షాద్ నగర్, వెలుగు: భద్రాచలం నుంచి సిటీకి గంజాయి సప్లయ్ చేస్తున్న ఓ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఫరూఖ్ నగర్ మండలం మొగిలిగిద్ద గ్రామ పరిధిలోని రంగసముద్రానికి చెందిన కుర్వ రమేశ్(35) డ్రైవర్గా పనిచేసుకుంటూ దిల్సుఖ్నగర్లో ఉంటున్నాడు. కొంతకాలం కిందట రమేశ్కు వరంగల్కు చెందిన వీరన్నతో పరిచయం ఏర్పడింది. వీరిద్దరు కలిసి గంజాయి సప్లయ్కు స్కెచ్ వేశారు. భద్రాచలం వెళ్లి అక్కడ సోమరాజు అనే వ్యక్తి నుంచి గంజాయిని కొని చెకింగ్లు లేని రూట్లో సిటీకి తీసుకురావాలని రమేశ్కు వీరన్న చెప్పాడు.
అతడు చెప్పినట్టే రమేశ్ భద్రాచలం వెళ్లి సోమరాజును కలిసి రూ.7 లక్షల విలువ చేసే 110 కిలోల గంజాయిని తీసుకుని మంగళవారం కారులో సిటీకి బయలుదేరాడు. దీని గురించి సమాచారం అందుకున్న శంషాబాద్ ఎస్వోటీ, షాద్నగర్ పోలీసులు జాయింట్ ఆపరేషన్ చేపట్టారు. అదేరోజు రాత్రి షాద్నగర్ టోల్గేట్ వద్ద కారును అడ్డుకుని తనిఖీ చేశారు. గంజాయి గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. బుధవారం రమేశ్ ను రిమాండ్ కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.