గచ్చిబౌలి, వెలుగు: గచ్చిబౌలిలోని బ్రహ్మకుమారీస్ శాంతి సరోవర్ ప్రాంగణంలో అడ్వర్టైజ్మెంట్ గ్యాస్ బెలూన్ పేలి నలుగురు గాయపడ్డారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. సంధ్య కన్వెన్షన్లో నిర్వహించిన హోలీ ఈవెంట్ కోసం ఏర్పాటు చేసిన హీలియం గ్యాస్ బెలూన్ గాలికి ఎగిరి శుక్రవారం ఉదయం బ్రహ్మకుమారీస్ ప్రాంగణంలో పడింది.
ఆ బెలూన్ను తొలగించేందుకు వలంటీర్లు ప్రసాద్, కృష్ణ, శ్రీను, సురేందర్ దగ్గరకు వెళ్లగా అది అకస్మాత్తుగా పేలింది. ఈ ఘటనలో నలుగురికి కాలిన గాయాలయ్యాయి. ప్రసాద్కు సుమారు 50 శాతం కాలిన గాయాలు కావడంతో పరిస్థితి విషమంగా ఉంది. కృష్ణ, సురేందర్, శ్రీనులకు సుమారు 30 శాతం గాయాలయ్యాయి. వారిని సమీపంలోని ప్రైవేట్ దవాఖానకు తరలించి చికిత్స అందిస్తున్నారు.
