లారీలో మంటలు.. వరుసగా పేలిన సిలిండర్లు

లారీలో మంటలు.. వరుసగా పేలిన సిలిండర్లు

ప్రకాశం జిల్లా కొమరోలు మండలం దద్దవాడ గ్రామం దగ్గరలోని అనంతపురం- గుంటూరు జాతీయ రహదారిపై అగ్ని ప్రమాదం జరిగింది. గ్యాస్ సిలిండర్లతో వెళ్తున్న లారీలో ఒక్కసారిగా మంటలు వచ్చాయి. లారీలో 300లకుపైగా సిలిండర్లు ఉన్నాయి. ఇందులో 100కు పైగా గ్యాస్ సిలిండర్లు పేలగా.. లారీ పూర్తిగా దగ్ధమైంది. 

కర్నూలు నుంచి నెల్లూరు జిల్లా ఉలవపాడుకు భారత్ గ్యాస్ సిలిండర్లతో వెళుతున్న లారీ క్యాబిన్ లో మంటలు వచ్చాయి. గమనించిన డ్రైవర్...లారీని ఆపీ పక్కకు వెళ్లాడు. దీంతో జాతీయ రహదారిపై రెండు వైపులా అర కిలో మీటర్ దూరంలో వాహనాలు నిలిపివేశారు. కొంచెం సేపటికి సిలిండర్లు పేలడం ప్రారంభం కావడంతో పోలీసులు అప్రమత్తమై అటువైపు ఎవరినీ వెళ్లకుండా చర్యలు తీసుకున్నారు. 

ప్రమాద స్థలానికి 300 మీటర్ల దూరంలో ఉన్న దద్దవాడలో హైవే పోలీసులు దాదాపు 30 ఇళ్లను ఖాళీ చేయించారు . ప్రమాద స్థలానికి 200 మీటర్ల దూరం నుంచి మంటలు ఆర్పేందుకు ఫైర్ సిబ్బంది ప్రయత్నించారు . గ్యాస్  లారీలో సిలిండర్లు భారీగా పేలడంతో సమీప గ్రామాల ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.