
గువాహటి: రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్ఐ) ఎన్నికలు ఇప్పట్లో జరిగేలా కనిపించడం లేదు. లైంగిక వేధింపుల కేసులో రెజ్లర్ల ఆందోళనను ఆపేందుకు వీలైనంత త్వరగా ఎన్నికలు జరపాలని ప్రయత్నించినా అడుగు ముందుకు పడటం లేదు. జూలై 11న జరగాల్సిన డబ్ల్యూఎఫ్ఐ ఎలక్షన్స్పై గౌహతి హైకోర్టు తాజాగా స్టే విధించింది. డబ్ల్యూఎఫ్ఐలో అఫిలియేటెడ్ మెంబర్గా ఉండేందుకు తమకు అర్హత ఉన్నా మెంబర్షిప్ను ఇవ్వడం లేదని అస్సాం రెజ్లింగ్ అసోసియేషన్ పిటిషన్ను దాఖలు చేసింది. దీనిపై విచారణ జరిపిన కోర్టు ఎన్నికలను వాయిదా వేసింది. 15 నవంబర్ 2014లో గోండాలో జరిగిన ఫెడరేషన్స్ జనరల్ కౌన్సిల్లో అప్పటి డబ్ల్యూఎఫ్ఐ కమిటీ తమకు మెంబర్షిప్ ఇవ్వాలని సిఫారు చేసిందని అస్సాం ఫెడరేషన్ వెల్లడించింది. కానీ అది కార్యరూపం దాల్చలేదని తెలిపింది. ఇప్పుడైనా తమకు గుర్తింపు ఇచ్చి ఎలక్టోరల్ కాలేజీకి తమ ప్రతినిధిని నామినేట్ చేయాలని కోరింది. అలా చేయని పక్షంలో ఎన్నికలు వాయిదా వేయాలని పిటిషనర్ డిమాండ్ చేశారు. ఈ వాదనను పరిగణలోకి తీసుకున్న హైకోర్టు కేసును జూలై 17కు వాయిదా వేసింది. అస్సాంలో రెజ్లింగ్ను ప్రోత్సహించడంలో తాము చాలా ముందున్నామని, అనేక టోర్నీలు కూడా నిర్వహిస్తున్నామని స్టేట్ ఫెడరేషన్ కోర్టు దృష్టికి తీసుకొచ్చింది.