Gautam Gambhir: ఢిల్లీ హైకోర్టుకు టీమిండియా హెడ్ కోచ్.. డీప్‌ఫేక్ వీడియోలపై గంభీర్ ఫైట్

Gautam Gambhir: ఢిల్లీ హైకోర్టుకు టీమిండియా హెడ్ కోచ్.. డీప్‌ఫేక్ వీడియోలపై గంభీర్ ఫైట్

Gautam Gambhir: భారత జట్టు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ తన వ్యక్తిత్వ హక్కుల రక్షణ కోసం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. తన పర్మిషన్ లేకుండా తన పేరు, ముఖం, గొంతును వాణిజ్య ప్రయోజనాల కోసం లేదా తప్పుడు ప్రచారం కోసం వాడుతున్న వారిపై కఠిన చర్యలకు సిద్ధమయ్యారు. తన ప్రతిష్టకు భంగం కలిగిస్తూ తన గుర్తింపును దుర్వినియోగం చేస్తున్న 16 మంది ప్రతివాదులపై గంభీర్ పిటిషన్ దాఖలు చేశాడు. ఇందులో కేవలం వ్యక్తులు మాత్రమే కాకుండా ప్రముఖ సోషల్ మీడియా అకౌంట్లు, ఈ-–కామర్స్ సైట్లు, అంతర్జాతీయ టెక్ కంపెనీలు కూడా ఉన్నాయి. 

గత కొన్ని రోజులుగా గంభీర్ చెప్పని మాటలను ఆయన చెప్పినట్లుగా చూపిస్తూ ఏఐ సాయంతో డీప్ ఫేక్ వీడియోలను సృష్టించి సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారు. గౌతమ్ తన కోచ్ పదవికి రాజీనామా చేసినట్లుగా సృష్టించిన ఓ ఫేక్ వీడియోకు ఏకంగా 29 లక్షల వ్యూస్ రావడం.. సీనియర్ ప్లేయర్స్ పై విమర్శలు చేసినట్లుగా ఉన్న మరో క్లిప్‌ బాగా వైరల్ అయ్యాయి. ఇలాంటి తప్పుడు సమాచారంతో ప్రజల్లో గందరగోళం ఏర్పడటంతో పాటు తన వృత్తిపరమైన జీవితంపై కూడా తీవ్ర ప్రభావం పడుతోందని గంభీర్ మండిపడ్డాడు. 

తన అనుమతి లేకుండా ఫోటోలతో పోస్టర్లు, ఉత్పత్తులను విక్రయిస్తున్న ఈ– -కామర్స్ సైట్లపై కూడా గంభీర్ సీరియస్ అయ్యారు. ఈ కేసులో జైన్కీ ఫ్రేమ్స్, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, మెటా (ఫేస్‌బుక్/ఇన్‌స్టాగ్రామ్), ఎక్స్ (ట్విట్టర్), గూగుల్, యూట్యూబ్ వంటి టెక్ దిగ్గజాలు ఉన్నాయి. బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్న వీరందరిపై కఠిన చర్యలు తీసుకోవాలని న్యాయస్థానాన్ని కోరాడు. ఈ న్యాయపోరాటం గురించి గంభీర్ స్పందిస్తూ.. "నా పేరు, గొంతు, ముఖాన్ని తప్పుడు మార్గాల్లో వినియోగిస్తున్నారు.. ఇది కేవలం నా వ్యక్తిగత విషయం మాత్రమే కాదు, ఇది చట్టం, వ్యక్తిగత గౌరవానికి సంబంధించిన అంశం అన్నారు. నా గుర్తింపును కొందరు తప్పుగా ఉపయోగిస్తున్నారన వెల్లడించారు.