
- తగ్గనున్న రూపాయి విలువ
- సెన్సెక్స్ మరో 3 శాతం వరకు పడొచ్చు
- ఎలక్ట్రానిక్స్, రత్నాలు, రొయ్యల ఎగుమతులపై తీవ్ర ప్రభావం
న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆగస్టు 1 గడువుకు ముందే ఇండియాపై 25 శాతం సుంకాలు వేస్తామని ప్రకటించారు. దీంతో యూఎస్కు ఎగుమతులు జరిపే చాలా కంపెనీలు నష్టపోనున్నాయి. ఈ రెసిప్రోకల్ టారిఫ్ల ప్రభావం వివిధ రంగాలపై వేరువేరుగా ఉంటుందని గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనీషియేటివ్ (జీటీఆర్ఐ) అంచనా వేస్తోంది. ఈ సంస్థ ఫౌండర్ అజయ్ శ్రీవాస్తవ ప్రకారం, ఇతర దేశాలపై విధించే సుంకాల ఆధారంగా భారత్పై ప్రభావాన్ని నిర్ణయించాలని తెలిపారు.
మన ఎగుమతులపై ఎఫెక్ట్..
మన ఎగుమతుల్లో 18 శాతం అమెరికాకు జరుగుతున్నాయి. 2023–24 లో 77.5 బిలియన్ డాలర్ల విలువైన ఎగుమతులు జరిగాయి. ట్రంప్ తాజా టారిఫ్ల వలన భారత జీడీపీ 40–-60 బేసిస్ పాయింట్లు తగ్గే అవకాశం ఉంది. ముఖ్యంగా ఎగుమతి ఆధారిత రంగాలలో ధరల పోటీతత్వం తగ్గుతుంది. రూపాయి విలువ క్షీణించొచ్చు. ప్రస్తుతం డాలర్ మారకంలో రూపాయి విలువ 85.69 వద్ద ఉంది. దీనివల్ల దిగుమతి ఖర్చులు పెరుగుతాయి. బీఎస్ఈ సెన్సెక్స్, నిఫ్టీ 50 సూచీలు 2–3 శాతం మేర పడొచ్చని ఎనలిస్టులు అంచనా వేస్తున్నారు.
ఎక్కువగా ప్రభావితమయ్యే రంగాలు..
ఎలక్ట్రానిక్స్: అమెరికాకు ఇండియా నుంచి 14 బిలియన్ డాలర్ల విలువైన ఎలక్ట్రానిక్స్ వస్తువులు ఎగుమతి అవుతున్నాయి. 25 శాతం టారిఫ్తో యూఎస్లో వీటి ధరలు పెరుగుతాయి. డిమాండ్ తగ్గొచ్చు. చైనాపై 30శాతం టారిఫ్ ఉన్నందున, భారత్కు స్మార్ట్ఫోన్ ఎగుమతుల్లో కొంత ప్రయోజనం ఉంటుంది.
రత్నాలు, ఆభరణాలు: 9 బిలియన్ డాలర్ల విలువైన రత్నాలు, ఆభరణాలు అమెరికాకు ఎగుమతి అవుతున్నాయి. తాజా టారిఫ్తో లగ్జరీ మార్కెట్లో పోటీతత్వం కోల్పోవచ్చు.
టెక్స్టైల్స్: 10 బిలియన్ బిలియన్ డాలర్ల విలువైన వీటి ఎగుమతులు జరుగుతున్నాయి. చైనా (టారిఫ్ 54శాతం), వియత్నాం (46శాతం), బంగ్లాదేశ్ (37శాతం)లపై ఎక్కువ టారిఫ్ల వల్ల భారత్కు యూఎస్ మార్కెట్లో కొంత ఉపశమనం దక్కుతుంది.
ఆటోమొబైల్స్: సెక్షన్ 232 కింద 25శాతం టారిఫ్ పడుతోంది. టాటా మోటార్స్ (జేఎల్ఆర్), సోనా బీఎల్డబ్ల్యూ వంటి సంస్థల మార్జిన్స్ 8-–12శాతం పడిపోవచ్చు.
స్టీల్, అల్యూమినియం: సెక్షన్ 232 కింద 25శాతం టారిఫ్లు ఇప్పటికే అమలులో ఉన్నాయి. అదనపు రెసిప్రోకల్ టారిఫ్లు పడవు. ఇండియా నుంచి అమెరికాకు ఉక్కు ఎగుమతులు తక్కువ. కాబట్టి ట్రంప్ టారిఫ్ల ప్రభావం ఈ సెక్టార్పై పరిమితంగా ఉండొచ్చు. అయితే, ఇతర దేశాల నుంచి ఇండియాలోకి స్టీల్ దిగుమతులు పెరిగే అవకాశం ఉంది. దీనికి ప్రభుత్వం రక్షణ చర్యలు తీసుకోవాలని ఇండస్ట్రీ వర్గాలు కోరుతున్నాయి. ఫార్మాస్యూటికల్ రంగం: ప్రస్తుతానికి రెసిప్రోకల్ టారిఫ్ల నుంచి మినహాయింపు ఉంది. అమెరికాకు ఇండియా నుంచి 12.72 బిలియన్ డాలర్ల విలువైన ఫార్మా ఎగుమతులు జరుగుతున్నాయి. యూరప్ (15శాతం టారిఫ్)తో పోలిస్తే, 25శాతం టారిఫ్ విధించినా, భారత జనరిక్స్ ధరలు తక్కువగా ఉండటం వల్ల టారిఫ్ ప్రభావం తక్కువగా ఉంటుందని శ్రీవాస్తవ తెలిపారు. వ్యవసాయ రంగం: భారత వ్యవసాయ, డెయిరీ రంగాల్లో మార్కెట్ యాక్సెస్ ఇవ్వాలని అమెరికా కోరుతోంది. కానీ భారత్ మాత్రం ఇవి సెన్సిటివ్ సెక్టార్లని తిరస్కరిస్తోంది. వ్యవసాయ రంగంలో యాక్సెస్ ఇవ్వకపోతే అమెరికాతో ఒప్పందం ఆలస్యం కావొచ్చు. అమెరికాకు అవకాశం ఇస్తే ఇతర దేశాలు (జపాన్, ఈయూ) కూడా ఇలాంటి మినహాయింపులు కోరొచ్చు. అమెరికాకు రొయ్యల ఎగుమతులు ఎక్కువగా జరుగుతున్నాయి. వీటిపై టారిఫ్ల ప్రభావం ఎక్కువగా ఉంటుంది.
పెనాల్టీలతో ఆయిల్ కంపెనీలకు కష్టం..
రష్యాతో వ్యాపారం చేస్తున్నందుకు ఇండియాపై పెనాల్టీ కూడా వేస్తామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. ఈ సెకండరీ ఆంక్షలు అమల్లోకి వస్తే , భారత రిఫైనరీలు ఎక్కువగా నష్టపోతాయి. వీటి మార్జిన్లు (లాభాలు) పడిపోతాయి. ఉక్రెయిన్తో యుద్ధాన్ని 15–20 రోజుల్లో రష్యా ముగించాలని, లేకపోతే ఈ దేశ ఎగుమతులపై 100శాతం టారిఫ్లు, భారత్ వంటి దేశాలపై సెకండరీ ఆంక్షలు విధిస్తామని ట్రంప్ హెచ్చరించారు. ప్రస్తుతం రష్యన్ క్రూడాయిల్ బ్యారెల్కు 3–-8 డాలర్ల తక్కువ ధరలో లభిస్తోంది. ఈ రేటుకు ఆయిల్ దొరకకపోతే రిఫైనరీ కంపెనీల ఖర్చులు పెరిగి, ఇంధన ధరలు పెరగొచ్చని ఎనలిస్టులు చెబుతున్నారు. ప్రస్తుతం మన ఆయిల్ దిగుమతుల్లో 40శాతం రష్యా నుంచి వస్తోంది. అమెరికా ఆంక్షలపై ఆందోళన లేదని, ప్రపంచ మార్కెట్లో సరఫరా సమృద్ధిగా ఉందని, భారత్ వివిధ సోర్స్ల నుంచి ఆయిల్ దిగుమతి చేసుకోగలదని ఆయిల్ మంత్రి హర్దీప్ సింగ్ పూరి పేర్కొన్నారు.