
- గురువారం భారీ వర్షాల వరద క్లియర్ చేసిన డీఆర్ఎఫ్
- ఎక్కడా కనిపించని జీహెచ్ఎంసీ ఇంజినీర్లు
- హైడ్రా చీఫ్ రిక్వెస్ట్ చేసినా లైట్ తీస్కున్నరు
హైదరాబాద్ సిటీ, వెలుగు: హైడ్రా, జీహెచ్ఎంసీ అధికారుల మధ్య వార్ నడుస్తోంది. మాన్సూన్ఎమర్జెన్సీ టీమ్స్ బాధ్యతలను ప్రభుత్వం హైడ్రాకు అప్పగించడాన్ని బల్దియాలోని కొందరు ఇంజినీరింగ్ అధికారులు జీర్ణించుకోలేకపోతున్నట్టు సమాచారం. వర్షాలు మొదలవకముందే మాన్సూన్టీమ్స్ ఏర్పాటు చేయాల్సిన బల్దియా ఆలస్యం చేయడం, టెండర్లను నోటిఫికేషన్లోనూ ఒకరికే లబ్ధి చేకూర్చేలా అవకతవకలకు పాల్పడ్డారనే ఆరోపణలు రావడంతో సర్కారు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ బాధ్యతలను హైడ్రాకు అప్పగించింది. దీంతో మాన్సూన్టీమ్స్కోసం టెండర్లను పిలిచే పనిలో ఉండగానే గురువారం భారీ వర్షం కురిసింది.
ఈ సహాయక చర్యల కోసం హైడ్రా డీఆర్ఎఫ్టీమ్స్రంగంలోకి దిగగా.. బల్దియా వారికి ఏ మాత్రం సహకరించడం లేదని తెలుస్తోంది. సహాయక చర్యల బాధ్యత మాది కానప్పుడు, ప్రభుత్వం హైడ్రాకు అప్పగించినప్పుడు ఏం చేస్తామని సైలెన్స్ గా ఉన్నట్టు సమాచారం. అయితే, ఈ వర్షాకాలంలో జీహెచ్ఎంసీ ఇంజినీర్లు హైడ్రాకు సహకరించాలని హైడ్రా కమిషనర్ ఇప్పటికే కోరినా ఆయన రిక్వెస్ట్ను పెడచెవిన పెట్టినట్టు తెలుస్తోంది. ఇదే అంశంపై జీహెచ్ఎంసీ ఇంజినీరింగ్ అధికారులను వివరణ కోరగా ‘మేము హైడ్రా కింద పని చేయాలంటే ఎవరికి సమాచారమివ్వాలి.. ఎక్కడైనా సమస్య ఏర్పడితే ఎవరికి చెప్పాలి? హైడ్రా అధికారుల ఫోన్ నంబర్లు ఇవ్వమంటే ఇవ్వడం లేదు’ అని చెప్తున్నారు.
కోర్డినేషన్ లేక ఇబ్బందులు..
హైడ్రా, జీహెచ్ఎంసీ అధికారుల మధ్య సమన్వయం లేకపోవడంతో జనానికి తిప్పలు తప్పడం లేదు. గత మూడు రోజులుగా భారీ వర్షాలు కురుస్తుండడంతో సహాయక చర్యల్లో లోపంతో ఇబ్బందులు పడుతున్నారు. గురువారం వర్షంతో చందానగర్, లింగంపల్లి, మియాపూర్, ఛత్రినాక, హిమాయత్ నగర్, లంగర్ హౌస్ ప్రాంతాల్లో వరద నిలిచిపోయింది.
14 సెంటీమీటర్ల వరకు వాన పడడంతో రహదారులు, రైల్వే అండర్ బ్రిడ్జీలు, అపార్ట్మెంట్ల సెల్లార్లు నీటితో నిండిపోయాయి. అయితే, స్థానిక జీహెచ్ఎంసీ అధికారులు మాత్రం దీన్ని పెద్ద సీరియస్గా తీసుకోలేదు. మరోవైపు హైడ్రా డీఆర్ఎఫ్ టీమ్స్ వచ్చేందుకు చాలా సమయం పట్టింది. దీంతో జనాలు ఇబ్బందులు పడ్డారు. ఇలాంటివి పునరావృతం కాకుండా హైడ్రా , జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులు ఓ సమావేశం ఏర్పాటు చేసుకుని మాన్సూన్టీమ్స్ఏర్పాటయ్యే వరకు సహకరించుకోవాలని సూచనలు వస్తున్నాయి.
మన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్ టెండర్లకు నేడు నోటిఫికేషన్
మన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్ టెండర్ల కోసం హైడ్రా శనివారం నోటిఫికేషన్ విడుదల చేయనుంది. మన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్ బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వం జీహెచ్ఎంసీకి కాకుండా హైడ్రాకి అప్పగించడంతో ఈ టీమ్స్ ని త్వరగా ఏర్పాటు చేసేందుకు కసరత్తు చేస్తున్నది. మొత్తం130 టీమ్స్ కోసం టెండర్లను ఆహ్వానిస్తుండగా, మూడ్రోజుల్లో ప్రీ బిడ్ మీటింగ్ ఏర్పాటు చేసి సంబంధిత ఏజెన్సీలు చేసే పనుల గురించి హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ వివరించనున్నారు. ఆ తర్వాత టెండర్కు సంబంధించిన డాక్యుమెంట్లను స్వీకరించి తక్కువ కోట్చేసిన వారికి బాధ్యతలను అప్పగించనున్నారు. మొత్తం ప్రక్రియను వారం రోజుల్లో పూర్తి చేయాలని హైడ్రా డిసైడ్ అయింది.