- ట్రావెల్ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యానికి మరో ప్రాణం బలి
- మృతుడు రాంకీ డంపింగ్ యార్డులో సర్కిల్ ఇన్చార్జి
- న్యాయం చేయాలని బంధువుల ఆందోళన
జీడిమెట్ల, వెలుగు: సిటీలో ప్రైవేట్ ట్రావెల్ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యానికి మరో ప్రాణం బలైంది. జీడిమెట్లలోని గాజులరామారంలో డ్యూటీకి వెళ్తున్న వ్యక్తిని బస్సు ఢీ కొట్టి, దాదాపు అర కిలోమీటర్మేర ఈడ్చుకెళ్లింది. సీఐ గడ్డం మల్లేశ్ వివరాల ప్రకారం.. యాప్రాల్లోని గోల్ఫ్ఫ్రైడ్ హోమ్లో నివాసం ఉంటున్న హరికృష్ణ (44) ఆర్మీలో పనిచేసి రిటైరయ్యాడు. గత నాలుగేళ్లుగా పైప్లైన్రోడ్డులోని రాంకీ డంపింగ్యార్డులో సర్కిల్ఇన్చార్జిగాపనిచేస్తున్నాడు. రోజు మాదిరిగానే బుధవారం ఉదయం 5.30 గంటలకు బైక్పై ఇంటి నుంచి డ్యూటీకి బయలుదేరాడు.
ఈ క్రమంలో గాజులరామారం సర్కిల్ వద్ద ఆర్.కె ట్రావెల్స్కు చెందిన బస్సు అతివేగంగా వచ్చి అతడిని వెనక నుంచి ఢీ కొట్టింది. అంతటితో ఆగకుండా దాదాపు అర కి.మీ. దూరం వరకూ ఈడ్చుకుంటూ వెళ్లడంతో హరికృష్ణ మృతి చెందాడు. ప్రమాదానికి కారణమైన బస్సు డ్రైవర్ ప్రస్తుతం పరారీలో ఉండగా, బాధిత కుటుంబానికి న్యాయం చేయాలంటూ తోటి జీహెచ్ఎంసీ ఉద్యోగులు, బంధువులు రోడ్డుపై ఆందోళనకు దిగారు. ఆర్.కె ట్రావెల్స్ యాజమాన్యం నిర్లక్ష్యంతో అనేక ప్రమాదాలు జరుగుతున్నాయని, ఆ బస్సులపై నిఘా పెట్టాలన్నారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆందోళన చేస్తున్న వారికి నచ్చచెప్పి, డెడ్బాడీని గాంధీ హాస్పిటల్కు తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
