డ్రా సిస్టంతో చైన్ మెన్ లు కేటాయింపు...శేరిలింగంపల్లి జోన్ లో నూతన పద్ధతి

డ్రా సిస్టంతో చైన్ మెన్ లు కేటాయింపు...శేరిలింగంపల్లి జోన్ లో నూతన పద్ధతి

గచ్చిబౌలి, వెలుగు: జీహెచ్​ఎంసీ శేరిలింగంపల్లి జోన్​లో ఉన్నతాధికారులు కొత్త పద్ధతిని అవలంభించారు. ఎన్నడూ లేని విధంగా డ్రా సిస్టం ద్వారా టౌన్​ ప్లానింగ్​ విభాగంలో చైన్​మెన్లను కేటాయించారు. ఇటీవల జీహెచ్​ఎంసీ టౌన్​ ప్లానింగ్​ విభాగంలో చైన్​మెన్ల బదిలీ జరిగింది. శేరిలింగంపల్లి జోన్​కు ఏడుగురు చైన్​మెన్లను కేటాయించారు.

 వీరంతా తమకు ఆమ్దాని వచ్చే సర్కిల్​లో పోస్టు ఇవ్వాలంటూ రాజకీయ నాయుకులు, యూనియన్​ లీడర్ల పైరవీలు చేస్తున్నారు. దీంతో జోన్​ ఉన్నతాధికారులు చైన్​మెన్లకు సర్కిల్​లను కేటాయించడంలో కొంత ఆలస్యం చేశారు. ఈ క్రమంలో డ్రా సిస్టం ద్వారా సర్కిల్​ కార్యాలయాలకు చైన్​మెన్లను కేటాయించేలా అధికారులు నిర్ణయం తీసుకున్నారు.

 జోనల్​ సీపీ ఆధ్వర్యంలోనే ఈ తతంగం నడవగా, దీనికి జోనల్​ కమిషనర్​ ఓకే చెప్పడం విశేషం. సిటీ ప్లానర్​ ఆధ్వర్యంలోనే ఈ డ్రా సిస్టం నిర్వహించారని జోనల్​ అధికారులు తెలిపారు. సోమవారం చందానగర్​ సర్కిల్​ కార్యాలయంలో ఇద్దరు చైన్​మెన్లు, శేరిలింగంపల్లి సర్కిల్​ కార్యాలయంలో ముగ్గురు, యూసఫ్​గూడ, పటాన్​చెరు సర్కిల్​ కార్యాలయాలకు ఒక్కో చైన్​మెన్​ను కేటాయించగా, ప్రస్తుతం వారు విధుల్లో చేరారు.