రూ. 5కే బ్రేక్ ఫాస్ట్, లంచ్ .. అన్నపూర్ణ క్యాంటీన్లకు కొత్త రూపు

రూ. 5కే బ్రేక్ ఫాస్ట్, లంచ్ .. అన్నపూర్ణ క్యాంటీన్లకు కొత్త రూపు
  •  సీటింగ్ అరేంజ్ మెంట్ తో పక్కా భవనాలు
  •  ఇందిరా క్యాంటీన్లుగా నామకరణం
  • పక్కా భవనాల కోసం రూ. 10  కోట్లు
  • లంచ్, బ్రేక్ ఫాస్ట్ బాధ్యత హరేకృష్ణ ఫాండేషన్ కే
  •  పర్యవేక్షణకు ప్రత్యేక స్టాండింగ్  కమిటీ
  • ఫస్ట్ ఫేజ్  మెనూలో ఉప్మా, ఇడ్లీ! 

హైదరాబాద్:  అన్నపూర్ణ కేంద్రాలకు అధునాతన హంగులు రానున్నాయి. ప్రస్తుతం రూ. 5కు మధ్యాహ్నం భోజనం మాత్రమే అందిస్తున్నారు. ఇకపై ఉదయం వేళ బ్రేక్ పాస్ట్ కూడా అందించేందుకు జీహెచ్ఎంసీ ఏర్పాట్లు చేస్తోంది. మధ్యాహ్నం పూట భోజనం కూడా అందించేందుకు ప్లాన్ చేస్తోంది. గత కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో, ముఖ్యమంత్రిగా కిరణ్ కుమార్ రెడ్డి  ఉన్నప్పుడు భాగ్యనగరంలో  “అన్నపూర్ణ” పేరుతో క్యాంటీన్లు ఏర్పాటయ్యాయి. రాష్ర్టంలోని వివిధ ప్రాంతాల నుంచి రాజధానికి వస్తున్న పేదలు మధ్యాహ్నం పూట అన్నపూర్ణ క్యాంటీన్లలోనే భోజనం చేస్తున్నారు.  వీటిని ఇందిరా క్యాంటీన్లుగా మార్చాలని  నగరపాలక సంస్థ నిర్ణయించింది. త్వరలోనే ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌ను కూడా రూ.5కే అందించేలా చర్యలు చేపడుతున్నారు. భోజన కేంద్రాల మెనూనూ తిరిగి డిజైన్ చేస్తున్నారు — ప్రతి ప్లేట్‌లో 400 గ్రాముల అన్నం, 120 గ్రాముల సాంబార్, 100 గ్రాముల కూరగాయ కూర, 15 గ్రాముల పచ్చడి(పికిల్)  చేర్చేలా ప్లాన్ చేస్తున్నారు. దీనికి తోడు ఉదయం పూట బ్రేక్ ఫాస్ట్ కూడా అందించనున్నారు. మొదటిగా ఉప్మా, ఇడ్లీ  మాత్రమే బ్రేక్ ఫాస్ట్ గా అందిస్తారని తెలుస్తోంది. తర్వాత పూరి, బోండాం, దోశ వంటివి అందించే అవకాశం ఉందని కూడా తెలుస్తోంది. 

150 ప్రాంతాల్లో సొంత భవనాల నిర్మాణం

ప్రస్తుతం అన్నపూర్ణ కేంద్రాలు రోడ్డు  పక్కన తుప్పు పట్టిన షెడ్లలో కొనసాగుతున్నాయి. అలా కాకుండా అధునాతన హంగులతో పక్కా భవనాలు నిర్మించేందుకు జీహెచ్ఎంసీ సిద్ధమవుతోంది. కొత్త భవనాల్లో కస్టమర్లు కూర్చొని టిఫిన్, భోజనం చేసేలా సీటింగ్ అరేంజ్ మెంటు కూడా ఉంటుంది. దీంతో పాటు తాగునీటి వసతిని కల్పిస్తారు. ప్రస్తుతం హైదరాబాద్ మహానగరంలో 150 అన్నపూర్ణ క్యాంటీన్లున్నాయి. వీటి సంఖ్యను పెంచేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రస్తుతం 11 ప్రాంతాల్లో సీటింగ్ క్యాంటీన్లను పునరుద్ధరించనున్నారు. 40  ప్రాంతాల్లో   40×10 అడుగుల, 99 చోట్ల 20×10 ఫీట్ల విస్తీర్ణంలో ఈ క్యాంటీన్లను నిర్మించనున్నారు. ఇందు కోసం రూ. 10 కోట్లు వెచ్చించాలని జీహెచ్ఎంసీ భావిస్తోంది.  ప్రస్తుతం ఈ కేంద్రాలకు హరే కృష్ణ ఫౌండేషన్ భోజనాన్ని సరఫరా చేస్తోంది. టిఫిన్స్  బాధ్యత కూడా అదే సంస్థకు అప్పగించారు.