కాంగ్రెస్ పార్టీలో మళ్లీ జాయిన్ అవుతున్నారంటూ వస్తున్న వార్తలపై జమ్ముకశ్మీర్ సీనియర్ నేత గులాంనబీ ఆజాద్ స్పందించారు. తాను కాంగ్రెస్ పార్టీలో తిరిగి చేరుతున్నట్లు వస్తున్న కథనాలు చూసి షాక్ అయ్యానని తెలిపారు. ప్రస్తుతం కాంగ్రెస్లోని ఒక వర్గం నాయకులు అసత్య కథనాలను ప్రచారం చేయిస్తున్నారని ఆరోపించారు. తమ నాయకులను మద్దతుదారులను నిరుత్సాహ పరిచేందుకు ఇలా చేస్తున్నారని మండిపడ్డారు. తనకు కాంగ్రెస్ పార్టీ, దాని నాయకత్వంపై ఎలాంటి దురభిప్రాయం లేదన్నారు. తన గురించి అతస్య ప్రచారాలు చేయడం మానుకోవాలని గులాంనబీ ఆజాద్ అభ్యర్థించారు. తాను కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తున్నారనే వార్త నిరాధారమైనదని చెప్పారు.
కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన గులాంనబీ ఆజాద్ రాహుల్ గాంధీపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ముఖ్యంగా పార్టీ నిర్ణయాల్లో రాహుల్గాంధీ మితిమీరిన జోక్యంపై ఆజాద్ తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశారు. సోనియాగాంధీ నామమాత్రపు అధ్యక్షురాలిగా ఉంటున్నారని, రాహుల్గాంధీ కోటరీ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నదని తన రాజీనామా లేఖలో ఆజాద్ పేర్కొన్నారు.