చండీగఢ్: టీ20 వరల్డ్ కప్లో పాల్గొనే టీమ్లో చోటు దక్కించుకోలేకపోయిన ఇండియా వన్డే కెప్టెన్ శుభ్మన్ గిల్ విజయ్ హజారే ట్రోఫీకి రెడీ అయ్యాడు. అతనితో పాటు టీ20 నంబర్ వన్ బ్యాటర్ అభిషేక్ శర్మ, పేసర్ అర్ష్దీప్ సింగ్ పంజాబ్ జట్టుకు ఎంపికయ్యారు. బుధవారం నుంచి జరిగే ఈ వన్డే ట్రోఫీలో టీమిండియా ప్లేయర్లంతా కనీసం రెండు మ్యాచ్ల్లో అయినా పాల్గొనాలని బీసీసీఐ ఆదేశించడంతో ఈ ముగ్గురూ బరిలోకి దిగుతున్నారు. న్యూజిలాండ్తో వన్డే సిరీస్ జనవరి 11న మొదలవుతున్న నేపథ్యంలో గిల్, అర్ష్దీప్ 2 లేదా 3 మ్యాచ్ల్లో మాత్రమే పంజాబ్ తరఫున ఆడనున్నారు. ఈ టోర్నీలో గ్రూప్–సిలో ఉన్న పంజాబ్ 24న మహారాష్ట్రతో, 26న చత్తీస్గఢ్తో పోటీపడనుంది. ప్రస్తుతం ఇండియా టీ20 టీమ్లో మాత్రమే ఉన్న అభిషేక్ ఈ రెండింటితో పాటు మరికొన్ని మ్యాచ్లకు అందుబాటులో ఉండనున్నాడు.
రోహిత్ తొలి రెండు మ్యాచ్ల్లో.. సూర్య చివరి రెండు మ్యాచ్లకు
లెజెండరీ క్రికెటర్ రోహిత్ శర్మ, ఇండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్, ఆల్రౌండర్ శివం దూబే హజారే ట్రోఫీలో ముంబైకి ఆడనున్నారు. హిట్మ్యాన్ రోహిత్ ఈ నెల 24, 26న సిక్కిం, ఉత్తరాఖండ్తో తలపడే తొలి రెండు మ్యాచ్ల్లో బరిలోకి దిగనున్నాడు. సూర్య, దూబే జనవరి 6, 8వ తేదీల్లో ముంబై చివరి రెండు మ్యాచ్లు ఆడతారని ముంబై క్రికెట్ అసోసియేషన్ వర్గాలు తెలిపాయి.
