కాసీపేట-1ఏ బొగ్గు గని ప్రారంభించిన జీఎం..  

కాసీపేట-1ఏ బొగ్గు గని ప్రారంభించిన జీఎం..  
  • కాసీపేట-1ఏ బొగ్గు గని ప్రారంభించిన జీఎం
  •     రోజుకు 500 టన్నులు బొగ్గు ఉత్పత్తి
  •     గనిలో 400 మంది ఉద్యోగులకు ఛాన్స్​

కోల్​బెల్ట్, వెలుగు:మందమర్రి ఏరియాలో నూతనంగా ఏర్పాటు చేసిన కాసీపేట1 ఏ బొగ్గు గనిని(టన్నెల్​) ఏరియా సింగరేణి జీఎం జి.మోహన్​రెడ్డి శుక్రవారం ప్రారంభించారు. ప్రస్తుతం నడుస్తున్న కాసీపేట1 గనిలో బొగ్గు వెలికితీత దూరం కావడంతో   2.5 కి.మీ దూరంలో కొత్తగా టన్నెల్ ద్వారా   కాసీపేట1ఏ గనిని అందుబాటులోకి తీసుకవచ్చారు. రూ.24.39 కోట్ల వ్యయంతో చేపట్టిన కాసీపేట1ఏ గని కోసం డిసెంబర్​ 6న పబ్లిక్​ హియరింగ్​ నిర్వహించారు. కొత్తగా ఏర్పాటైన  గని లో 400 మంది ఉద్యోగులు పనిచేయనుండగా రోజుకు సుమారు 500 టన్నుల బొగ్గు ఉత్పత్తి చేయనున్నారు. ఏడాదికి లక్ష టన్నుల బొగ్గు ఉత్పత్తి చేయాలని సింగరేణి యాజమాన్యం టార్గెట్​ పెట్టుకుంది.  సెమీ మెకానైజేషన్​ ద్వారా మూడు ఎస్​డీఎల్​ యంత్రాల సహయంతో బొగ్గును ఉత్పత్తి చేయనున్నారు. ఏరియాలో మూతపడనున్న ఆర్కే1ఏ, కేకే1 గనులకు సంబంధించిన కార్మికులను కాసీపేట1ఏ టన్నెల్​లో సర్దుబాటు చేయనున్నారు. కొత్తగా టన్నెల్​ అందుబాటులోకి తీసుకరావడం పట్ల కార్మికుల్లో సంతోషం వ్యక్తమైంది.

కొత్త టన్నెల్​ వల్ల దూరభారం తగ్గుతుంది…

కాసీపేట1 గనికి అనుబంధంగా కొత్తగా అందుబాటులోకి తీసుకవచ్చిన కాసీపేట1ఏ టన్నెల్​ వల్ల ఉద్యోగులకు దూరభారం తగ్గుతుందని ఏరియా జీఎం మోహన్​రెడ్డి తెలిపారు. గనిలో ఉత్పత్తి అయిన బొగ్గును రోడ్​ ట్రాన్స్​ఫోర్ట్​ ద్వారా కోల్​ హ్యాండ్లింగ్​ ప్లాంట్​(సీహెచ్​పీ)కి రవాణా చేస్తామన్నారు. అంతకు ముందు   కాసీపేట1ఏ టన్నెల్​కు సంబంధించిన 150హెచ్​పీ సర్పేస్​ హాలర్​, పవర్​ ట్రిఫ్లర్​, 1000కేవీ సబ్​ స్టేషన్లను జీఎం ప్రారంభించారు. కార్యక్రమంలో ఏరియా ఏస్వోటుజీఎం ఎ.రాజేశ్వర్​రెడ్డి, కాసీపేట గ్రూప్​ ఏజెంట్​ కుర్మ రాజేందర్, గని మేనేజర్​ అల్లావుద్ధీన్​, ఏరియా సేఫ్టీ ఆఫీసర్​ ఎం.రవిందర్​, పర్సనల్​ మేనేజర్​ శ్యాంసుందర్​, ఏజీఎం నాగరాజు, గని సేఫ్టీ ఆఫీసర్​ సునీల్​ కుమార్​, డిప్యూటీ మేనేజర్​ వెంకటేశ్​, గని సంక్షేమ అధికారి మీర్జా గౌస్ జిషాన్, కార్మిక సంఘాల లీడర్లు పాల్గొన్నారు.